టిల్లుకి, నాకు ఆ ఒక్కటే తేడా..మిగతావన్నీ సేమ్‌ టు సేమ్‌: స్టార్‌ బాయ్‌ సిద్ధు

28 Mar, 2024 18:19 IST|Sakshi

‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో ‘టిల్లు స్వ్కేర్‌’ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్‌ని అందించడానికి ప్రయత్నించాం’ అన్నారు స్టార్‌ బాయ్‌ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్‌’. 'డీజే టిల్లు'చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం  సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

‘డీజే టిల్లు’ కథకి, టిల్లుగాడి పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు.

 డీజే టిల్లులో  హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. 

 ఈ సినిమాలోని టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా.

ఈ సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం.

సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది.

త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు.

ఈ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది.

ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది.

Election 2024

మరిన్ని వార్తలు