విశాఖపట్నం జిల్లాకు ఎన్నో విశిష్టతలున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలోని విశాఖపట్నం అందమైన నగరం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.
చరిత్రలో ఒకప్పుడు ఈ జిల్లాలో బౌధ్ధమతం వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, తొట్లకొండలో అవశేషాలు చూడవచ్చు. విశాఖపట్నం నగరంలో ప్రాచీనమైన సింహాచలం దేవాలయం, వలస పక్షులు వచ్చే కొండకర్ల ఆవ ఇతర ప్రముఖ పర్యాటక కేంద్రాలు. ఇక్కడి నుంచి అరకులోయ ప్రముఖ పర్యాటక ప్రాంతం
గోదావరి నది వరకు విస్తరించిన ప్రాచీన కళింగ సామ్రాజ్యంలో భాగమైన ఈ ఉమ్మడి జిల్లా ప్రాంతపు ప్రస్తావన సా.శ.పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంథాలలోను, సా.శ.పూ. 4 వ శతాబ్దికి చెందిన సంస్కృత వ్యాకరణ పండితులైన పాణిని, కాత్యాయనుని రచనలలోను ఉంది.
సా.శ. 260లో అశోక చక్రవర్తి పాలనలో కళింగదేశం ఉండేది. ఆ కళింగదేశంలో, అంతర్భాగంగా ఈ విశాఖపట్నం ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, త్రికళింగదేశం అనే (త్రిలింగదేశం) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: 7 వ శతాబ్దంలో కళింగులు, 8 వ శతాబ్దంలో వేంగి (ఆంధ్ర రాజులు) చాళుక్యులు, తరువాతి కాలంలో రాజమండ్రి రెడ్డి రాజులు, పల్లవ రాజులు, చోళులు, గంగ వంశం రాజులు గోల్కొండకు చెందిన కుతుబ్ షాహిలు, మొగలులు, హైదరాబాదు నవాబులు ఈ ప్రాంతాన్ని పాలించారు. 15వ శతాబ్దం నాటికి విజయనగర సామ్రాజ్యంలో అంతర్బాగమైంది.
కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, 18 వ శతాబ్దంలో బ్రిటిషు వారి వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం జిల్లాగా ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు జరిపిన రంప పితూరీ, 1922 నుంచి 1924 వరకు రెండు సంవత్సరాలు జరిగింది. 1941 ఏప్రిల్ 6న జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్నం మీద బాంబులు వేసాయి అయితే ప్రాణనష్టం జరగలేదు.
1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లాగా ఏర్పడింది. మిగిలిన విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలోని కొన్ని ప్రాంతాలను అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలలో చేర్చారు.
జిల్లా | విశాఖపట్నం |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
అసెంబ్లీ నియోజకవర్గాలు | 15 |
మొత్తం ఓటర్ల సంఖ్య | 3,721,676 |
పురుషులు | 1,829,059 |
మహిళలు | 1,892,446 |