నా మాటలను వక్రీకరించారు

2 Jan, 2018 10:59 IST|Sakshi

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న 

సాక్షి, ఆసిఫాబాద్‌: ఆదివాసీల ఉద్యమం వెనుక మాజీ మావోయిస్టులు ఉన్నారని తానెప్పుడూ అనలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కావాలనే కొందరు తన మాటలను వక్రీకరించారని పేర్కొనారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి చెప్పిన మాటలను తాను చెబితే కొందరు వక్రీకరించారని అన్నారు. అల్లర్ల వెనుక మావోయిస్టులు ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తాను కానీ ఎక్కడా అనలేదని తెలిపారు. కావాలనే కొంతమంది తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. 

ఇటీవల ఆసిఫాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో తాను డీజీపీ పేర్కొన్న విధంగా అలర్లను అదనుగా తీసుకుని అదృశ్యశక్తులు బలపడతాయనే విషయాన్ని చెప్పానే తప్ప ఆదివాసీ ఉద్యమానికి, మావోయిస్టులకు సంబంధం ఉందని చెప్పలేదని స్పష్టం చేశారు. ఆదివాసీల సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా పరిష్కారం చూపుతుందన్నారు. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఏజెన్సీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అందరూ సమన్వయంతో మెలగాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తమకు విన్నవిస్తే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
 

మరిన్ని వార్తలు