మీకు మీరేనా మందలగిరి మారాజా?

5 Jul, 2019 12:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు, ఆయన పుత్ర రత్నం నారా లోకేశ్‌బాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే  పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?’ అని లోకేశ్‌ బాబునుద్దేశించి విజయసాయిరెడ్డి పరోక్షంగా ప్రశ్నించారు.

చంద్రబాబు పిల్లి శాపాలకు ఉట్లు తెగవన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంటున్నారని, తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్టు చెప్పడం ఎందుకని మండిపడ్డారు. అన్నమాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపిస్తారని, అందరు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.

లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించారని, కానీ రికార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరునే ఉందన్నారు. తర్వాత దాని మరమత్తుల పేరిట రూ.8 కోట్లు ఖర్చుపెట్టారని, ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబే చెప్పాలని విజయసాయిరెడ్డి నిలదీశారు.
 

మరిన్ని వార్తలు