అంతర్రాష్ట్ర బైక్‌ దొంగల అరెస్టు

19 Jan, 2018 09:25 IST|Sakshi

గుత్తి: గుత్తి పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు అంతర్రాష్ట్ర బైక్‌ దొంగలను అరెస్టు చేయడంతో పాటు సుమారు రూ. 12 లక్షల విలువ చేసే 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో గురువారం దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ మహబూబ్‌బాషా, సీఐ ప్రభాకర్‌గౌడ్‌లు తెలిపారు. గత యేడాది కాలంగా అనంతపురం, కర్నూల్, కడప జిల్లాల పరిధిలో తరుచూ బైక్‌ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో అనంతపురం ఎస్పీ అశోక్‌ కుమార్‌ అఫెండర్స్‌ సర్వ్‌లైన్స్‌ సిస్టమ్‌ (పాత నేరస్తుల నిఘా కార్యక్రమం) ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా గతంలో బైక్‌ చోరీలు ఎక్కడెక్కడ జరిగాయి? వాటి అఫెండర్స్‌ ఎవరు? అనే విషయాలను ఆరా తీశారు.  ఈ క్రమంలో గుత్తిలో గత మూడు మాసాల్లో 8 బైక్‌లు చోరీకి గురయ్యాయి.
 

నిఘా కార్యక్రమం ఆధారంగా గుత్తి సీఐ ప్రభాకర్‌గౌడ్‌ బైక్‌ దొంగలను పసిగట్టారు. ఇందులో భాగంగానే గురువారం ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా అంతరాష్ట్ర బైక్‌ దొంగల గుట్టు రట్టైంది. గుత్తి మండలం ఊబిచెర్లకు చెందిన బాచుపల్లి రామకృష్ణ, చండ్రపల్లి సుంకన్నలు పోలీసు విచారణలో నేరాన్ని అంగీకరించారు.గుత్తిలో 8 బైక్‌లు, తాడిపత్రిలో 5, డోన్‌లో 1, పత్తికొండలో 1, వజ్రకరూర్‌లో 1, యాడికిలో 1, అనంతపురంలో 5, కడపలో 2 బైక్‌లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే రాజు అనే మరోదొంగ పరారైనట్లు చెప్పారు. బైక్‌ దొంగలను పట్టుకోవడంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఎస్‌ఐలు వలిబాషు, యువరాజు, పోలీసు కానిస్టేబుళ్లు మోహన్, గణేష్‌లకు నగదు రివార్డును అందజేశారు. 
 

మరిన్ని వార్తలు