1న పాస్‌పోర్ట్ మేళా

25 Oct, 2014 01:02 IST|Sakshi
1న పాస్‌పోర్ట్ మేళా

విశాఖపట్నం : పాస్‌పోర్ట్ ప్రత్యేక మేళాను నవంబర్ ఒకటో తేదీన నిర్వహిస్తున్నట్టు పాస్‌పోర్ట్ అధికారి ఎన్.ఎల్.పి.చౌదరి తెలిపారు. మూడు రోజులు ముందుగా స్లాట్ బుకింగ్‌లు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు మేళాలో పాల్గొనడానికి అర్హులుగా ప్రకటించారు. కొత్త పాస్‌పోర్ట్, రీ షెడ్యూల్(సాధారణ) అభ్యర్థులను మేళాకు ఆహ్వానిస్తున్నారు.

మేళాలో 800 మందికి పాస్‌పోర్ట్ సేవలు కల్పించి స్లాట్ బుకింగ్‌లు అందజేస్తారు. స్లాట్ పొందిన అభ్యర్థులు అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్(ఎఆర్‌ఎన్) ఫారంతో పాటు గుర్తింపు, చిరునామాపత్రాలతో బిర్లా జంక్షన్ దరి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో హాజరుకావాలి. అభ్యర్థులు పాస్‌పోర్ట్ వెబ్‌సైట్ www.passportindia. gov.in ద్వారా స్లాట్‌లు పొందవచ్చు.

విశాఖపట్నం పాస్‌పోర్ట్ కార్యాలయం పరిధిలో గల ఐదు జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరిలో కామన్ సర్వీస్ సెంటర్‌లు(మీ-సేవ)ద్వారా పాస్‌పోర్ట్ సేవలు పొందవచ్చని పాస్‌పోర్ట్ అధికారి తెలిపారు. ఐదు జిల్లాల లో ఎంపిక చేసిన మీ-సేవ కేంద్రాలలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు నింపడం, స్లాట్ బుకింగ్, ఫీజుల చెల్లింపులు జరపవచ్చన్నారు. రూ.100 చార్జీ చెల్లించి మీ-సేవ  కేంద్రాలలో సేవలు ప్రజలు పొందవచ్చని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు