హైకోర్టుకు 10 మంది కొత్త న్యాయమూర్తులు

13 Sep, 2013 01:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన పది మంది సీనియర్ న్యాయవాదులు, జిల్లా జడ్జిలను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పంపిన సిఫారసులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టులో న్యాయవాదులుగా ఉన్న దామా శేషాద్రినాయుడు, ఎ.రామలింగేశ్వరరావులతోపాటు జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న 9 మందిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం సిఫారసు చేసినట్లు తెలిసింది.
 
ఈ సిఫారసులను పరిశీలించిన సుప్రీంకోర్టు శేషాద్రినాయుడు, రామలింగేశ్వరరావుతోపాటు 8 మంది జిల్లా జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తులుగా నియామకానికి ఆమోదం తెలిపినట్లు సమాచారం. అనంతరం ఫైలు కేంద్ర న్యాయశాఖకు చేరింది. కేంద్ర న్యాయ శాఖ వర్గాలు నిబంధనల ప్రకారం శేషాద్రినాయుడు, రామలింగేశ్వరరావుల అంగీకారాన్ని కోరాయి. న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టేందుకు వారిద్దరూ గురువారం తమ అంగీకారాన్ని తెలిపారు. ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయగానే, న్యాయమూర్తులుగా వీరి నియామకంపై కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. శేషాద్రినాయుడు చిత్తూరు జిల్లాకు, రామలింగేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన వారు.

>
మరిన్ని వార్తలు