ఒకేరోజు 101 మంది డిశ్చార్జ్

30 May, 2020 05:21 IST|Sakshi

ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,044 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇందులో 79 మంది రాష్ట్రంలోని వాళ్లు కాగా 22 మంది వలస కూలీలు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,226కు చేరింది. రికవరీ రేటు 66.85 శాతానికి చేరింది.

గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 11,638 మందికి పరీక్షలు నిర్వహించగా 85 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో 52 మంది పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 3,330కు చేరింది. ఇందులో 345 మంది వలస కూలీలు ఉండగా, కోయంబేడు కాంటాక్టు కేసులు 223, విదేశాల నుంచి వచ్చిన వారు 111 మంది ఉన్నారు. వీరిని మినహాయిస్తే ఏపీలో కరోనా పాజిటివ్‌ సోకిన కేసుల సంఖ్య 2,674గా ఉంది. శుక్రవారానికి మొత్తం మరణాల సంఖ్య 60కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,044గా ఉంది. 

>
మరిన్ని వార్తలు