10వ రోజు పాదయాత్ర డైరీ

17 Nov, 2017 02:28 IST|Sakshi

16–11–2017, గురువారం 
దొర్నిపాడు, కర్నూలు జిల్లా  

ప్రజల కన్నీళ్లకు శక్తి ఎక్కువ
ఈ రోజు పాదయాత్ర ఆళ్లగడ్డ శివారు నుంచి ఉదయం 8.30కి ప్రారంభం అయింది. పాద యాత్రలో జరీనా అనే పద్నాలుగేళ్ల పాప వచ్చి కలి సింది. ఆమె తండ్రి జమాల్‌ వలీ ఆటో డ్రైవర్‌. జరీనా ముక్కు, కుడిబుగ్గపై రక్తనాళా లకు సంబంధించిన పుండు ఉంది. కేవలం సర్జరీ ద్వారానే ఆమె బాధ నయమవు తుంది. ఈ సౌకర్యం హైదరాబాద్‌ నిమ్స్‌లో మాత్రమే ఉంది. ఆరోగ్యశ్రీ కార్డుతో ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లారు. అన్ని పరీక్షలూ ముగిశాయి. ఆమె ఆపరేషన్‌కు తేదీ కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు వెళ్లేటప్పటికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను చంద్రబాబు ప్రభుత్వం తొలగించిందనీ, ఆంధ్రాలోనే ఆపరేషన్‌ చేయించుకోవాలంటూ నిమ్స్‌ వైద్యులు జరీనాను వెనక్కి పంపారు.

ఇక్కడ ఏ ఆసుపత్రికి వెళ్లినా సౌకర్యాలు లేవు, నిమ్స్‌కి వెళ్లమనే చెబుతున్నారు. దాదాపు సంవత్సరం నుంచి ఆ పాప నరకయాతన అనుభవిస్తోంది. జరీనా చికిత్స కోసం ఆమె తండ్రి ఒక ఆటోను కూడా అమ్ముకున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న సామాన్యులు హైదరా బాద్‌లో ఉన్న ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి డబ్బులు మిగుల్చుకోవాలన్న కక్కుర్తి తప్ప! చంద్రబాబు తీసుకున్న ఈ దిక్కుమాలిన నిర్ణయం వల్ల వేలాది మంది రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. ప్రజల కన్నీళ్లకు శక్తి ఎక్కువ. ఈ విషయం చంద్రబాబు గారికి త్వరలోనే అర్థమవుతుంది. 

ఆళ్లగడ్డ సమీపంలో ఇరవై వేల హెక్టార్లలో పత్తి విత్తనోత్పత్తి జరుగుతోంది. దొర్నిపాడు గ్రామం దగ్గర విత్తనోత్పత్తి రైతులు వచ్చి నన్ను కలిశారు. ఈ రోజున వీరికి కూడా గిట్టుబాటు ధర లేదు. నాన్నగారు ఇచ్చిన మద్దతును, ప్రోత్సాహాన్ని వాళ్లు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. 

గతంలో మోన్‌శాంటో కంపెనీ వీరి దగ్గర నుంచి 750 గ్రాముల విత్తనాలను కేవలం 200 రూపాయలకు కొనేది. రైతులకు 450 గ్రాముల ప్యాకెట్‌ను 1,650 రూపాయలకు అమ్మేది. నాన్నగారు ఆ కంపెనీపై న్యాయపోరాటం చేసి విత్తనోత్పత్తి రైతులకు ఇచ్చే ధరను 500 రూపాయలకు పెంచారు, రైతుల దగ్గర నుంచి వసూలు చేసే ధరను 650 రూపాయలకు తగ్గించారు. చంద్రబాబు 2014లో గద్దెనెక్కేవరకూ ప్రతి సంవత్సరం మే నెలలో విత్తన కంపెనీలు, రైతు సంఘాలతో ప్రభుత్వం మీటింగ్‌ పెట్టేది.

విత్తన కంపెనీలు రైతు వ్యతిరేక ప్రతిపాదనలు ఏమైనా చేస్తే రైతు సంఘాలు వాటిని నిలువరించేవి. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు ఈ మీటింగుకు రైతు సంఘాలను పిలవడం మానేశారు. ఫలితంగా ఈ రోజు విత్తనోత్పత్తి రైతులకు వచ్చే ధర 500 రూపాయల నుంచి 420 రూపాయలకు పడిపోయింది. కంపెనీలకు రైతులు చెల్లించే ధర 650 రూపాయల నుంచి 850 రూపాయలకు పెరిగింది. అంటే నాన్నగారి పోరాటం వల్ల పత్తి రైతులకు వచ్చిన లాభాన్ని చంద్రబాబు వారికి దక్కనివ్వకుండా చేశారు. 

చివరిగా చంద్రబాబును ఆరోగ్యశ్రీపై వివరణ అడగదలుచు కున్నాను. కర్ణాటక రాష్ట్రమే తమ ఆరోగ్యశ్రీ పథకం కింద హైదరాబాద్‌లోని ఆసుపత్రులను గుర్తిస్తున్నప్పుడు, మీరు నిలిపివేయడానికి కారణం ఏమిటి? ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం కాదా? సామాన్యుల ప్రాణాల కంటే మీ అస్మదీయుల ప్రయోజనాలే మీకు ముఖ్యమా? వివరిస్తారని ఆశిస్తున్నాను. 
- వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు