వెబ్ కౌన్సెలింగ్‌లో.. ఐదోరోజు 12,047 మంది హాజరు

24 Aug, 2013 01:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: ఇంజనీరింగ్, ఫార్మసీలో ప్రవేశానికి నిర్వహిస్తున్న వెబ్ కౌన్సెలింగ్‌లో భాగమైన సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియలో ఐదోరోజు 12,047 మంది విద్యార్థులు హాజరయ్యారు. సీమాంధ్రలోని 38 కేంద్రాల్లో 18 కేంద్రాలే పనిచేస్తుండగా, వీటిలో 6,018 మంది హాజరయ్యారు. తెలంగాణలోని 22 కేంద్రాల్లో 6,029 మంది హాజరయ్యారు. కాగా విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల తనిఖీకి శుక్రవారం ఏర్పా టైన సహాయక కేంద్రంలో షెడ్యూలును సవరించారు.
 
  కొత్త షెడ్యూలు ప్రకారం 24న 10,001 నుంచి 20,000 వరకు, 25న 20,001 నుంచి 30,000 వరకు, 26న 30 వేల నుంచి 40 వేల వరకు, 27న 40 వేల నుంచి 50 వేల వరకు, 28న 50 వేల నుంచి 60 వేల వరకు, 29న 60 వేల నుంచి 70 వేల వరకు, 30న 70 వేల నుంచి 80 వేల వరకు ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావచ్చని అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నేటినుంచి కర్నూలు రాయలసీమ వర్సిటీలో సర్టిఫికెట్ల తనిఖీ కేంద్రం పనిచేస్తుందని చెప్పారు.
 
 ఇక్కడ 24న 60 వేల నుంచి 80 వేల వరకు, 25న 80 వేల నుంచి 90 వేల వరకు, 26న 90 వేల నుంచి లక్ష వరకు, 27న లక్ష నుంచి లక్షా 10 వేల వరకు, 28న లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకు, 29న లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల వరకు, 30న లక్షా 30 వేల నుంచి లక్షా 40 వేల వరకు గల ర్యాంకర్లకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఈ షెడ్యూలు అనంతరం సమీక్ష జరిపి 29న తదుపరి ర్యాంకర్లకు షెడ్యూలు ప్రకటిస్తామన్నారు. విశాఖలోని వీఎస్ కృష్ణ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు సర్టిఫికెట్ల తనిఖీ ప్రారంభమైన గంటకే సర్వర్ మొరాయించింది. దీంతో గంటసేపు జాప్యం జరిగింది. సాయంత్రం 6 గంటల సమయానికి 8 వేల ర్యాంకులకు 262 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం దృష్ట్యా ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కౌన్సెలింగ్ కేంద్రం వద్ద పారా మిలటరీ బలగాలను మోహరించారు.

మరిన్ని వార్తలు