160 కిలోల గంజాయి స్వాధీనం

19 Jul, 2019 09:14 IST|Sakshi
అనంతపల్లి వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన ఓ నిందితుడు 

సాక్షి, పశ్చిమ గోదావరి: నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద పోలీసుల వాహన తనిఖీలో అక్రమంగా రవాణా అవుతున్న గంజాయి గుట్టు రట్టయింది. నర్సీపట్నం నుంచి హైదరాబాదు 80ప్యాకెట్లలో దాదాపు 160కిలోల గంజాయిని నీలిరంగు క్రిటా కారులో తరలిస్తుండుగా గురువారం సాయంత్రం పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. ఈగంజాయి అక్రమ రవాణాలో ఒక మహిళ, మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న టీఎస్‌ 07 యూహెచ్‌ 3658 నీలిరంగు క్రిటా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  తొలుత ఈ కారు నర్సీపట్నం నుంచి బయలుదేరి తణుకు, తాడేపల్లిగూడెం బైపాస్‌ మీదుగా వెళ్తుండుగా చేబ్రోలు వద్ద వాహన తనిఖీలు జరుగుతున్నట్టు ఈ ముఠాకు సమాచారం అందడంతో తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం నుండి తెలికిచెర్ల–అనంతపల్లి–కొయ్యలగూడెం మీదుగా ఖమ్మం వెళ్ళేందుకు ప్లాను చేసుకున్నారు. అనంతపల్లి సెంటర్‌లో కారును రోడ్డుపక్కన పెట్టి టీ తాగేందుకు ఆగారు. అటుగా వెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ళు అనుమానం వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తాడేపల్లిగూడెం టౌన్‌ సీఐ ఆకుల రఘు, నల్లజర్ల ఎస్‌ఐ కె.చంద్రశేఖర్‌ కేసునమోదు చేసారు. ముద్దాయిలను అరెస్టు చేయాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు