15 రోజుల్లో 1,648 వాహనాలు సీజ్

1 Jun, 2020 04:27 IST|Sakshi

మద్యం అక్రమ రవాణాపై ఎస్‌ఈబీ ఉక్కుపాదం

12,679 లీటర్ల ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ సీజ్‌..

పట్టుబడిన 3,281 లీటర్ల డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌

మద్యం తరలిస్తూ పట్టుబడిన వాటిలో లగ్జరీ కార్లే అధికం!

సాక్షి, అమరావతి: స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) దాడుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలు భారీగా పట్టుబడుతున్నాయి. రాష్ట్రంలో అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితం ఎస్‌ఈబీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ 15 రోజుల్లో అక్రమంగా మద్యం తరలిస్తున్న 1,648 వాహనాలను ఎస్‌ఈబీ అధికారులు సీజ్‌ చేశారు. వీటిలో అధికంగా ఖరీదైన హై ఎండ్‌ మోడల్‌ కార్లు ఉండటం గమనార్హం. ప్రధానంగా ఖరీదైన కార్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం పట్టుబడుతోంది. పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడటంతో వీటిని ఉంచేందుకు ఎక్సైజ్‌ స్టేషన్లు సరిపోవడం లేదు. దీంతో ఎక్సైజ్‌ స్టేషన్లలో ఉన్న అంతకుముందు పట్టుబడిన పాత వాహనాలకు వేలం ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

► నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ (ఎన్‌డీపీఎల్‌) ఒక్క బాటిల్‌ ఉన్నా వాహనాన్ని సీజ్‌ చేస్తారు. అదే డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ బాటిళ్లు మూడుకు మించి ఉంటే కేసులు నమోదు చేస్తారు.
► సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్‌ పార్టీలను రంగంలోకి దించి మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నారు.
► పదే పదే పట్టుబడుతున్న వారిపై పీడీ కేసులు నమోదు చేయనున్నారు.

మరిన్ని వార్తలు