17 మంది క్రికెట్‌ బుకీల అరెస్టు

9 May, 2018 10:31 IST|Sakshi

రూ.81 వేల నగదు, పది సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ స్వాధీనం

నిందితుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ రామాంజనేయులు 

మార్కాపురం: డివిజన్‌ కేంద్రం మార్కాపురంలో 17 మంది క్రికెట్‌ బుకీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.81 వేల నగదు, 10 సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలు చెప్పారు. డీఎస్పీ కథనం ప్రకారం.. ఈ నెల 7వ తేదీ రాత్రి హైదరాబాద్‌ వర్సెస్‌ రాయల్‌ చాలెంజెస్‌ బెంగళూరు జట్ల మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. పట్టణంలోని దోర్నాల బస్టాండ్‌ సెంటర్‌ కేథార్‌ ఇంటర్నెట్‌ షాప్, ఓ ఫర్నిచర్‌ షాప్‌పైన ఉన్న ఇంటర్నెట్‌ షాప్‌లో కొంత మంది క్రికెట్‌ బెట్టింగ్‌లు పెడుతున్నట్లు పట్టణ ఎస్‌ఐ కోటయ్యకు సమాచారం అందింది. 

ఆయన తన సిబ్బందితో వెళ్లి క్రికెట్‌ బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో మార్కాపురం మండలం రాయవరం వద్ద కొంతమంది క్రికెట్‌ బెట్టింగ్‌ పెడుతున్నట్లు డీఎస్పీకి సమాచారం అందటంతో ఆయన రూరల్‌ ఎస్‌ఐ మల్లికార్జున్‌ను అక్కడికి పంపిం చారు. క్రికెట్‌ బెట్టింగ్‌ పెడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మీద 17 మంది క్రికెట్‌ బెట్టింగ్‌ పెడుతున్నట్లు గుర్తించి వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారణ చేయగా మరికొందరి పేర్లు తెలిపారు.

 వీరిలో ముగ్గురు ఆర్గనైజర్లు, మరో నలుగురు క్రికెట్‌ బుకీలు ఉన్నారు. వారు పరార్‌ అయ్యారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. పట్టుకున్న 17 మంది ప్రొద్దుటూరు, బెంగళూరుల్లో కూడా క్రికెట్‌ బెట్టింగ్‌లు పెడుతుంటారని డీఎస్పీ తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు కోటయ్య, మల్లికార్జునరావు, సిబ్బందిని ఆయన అభినందించారు.

మరిన్ని వార్తలు