రెవెన్యూలోటు భర్తీకి మరో 1800 కోట్లు

1 Apr, 2015 02:51 IST|Sakshi
రెవెన్యూలోటు భర్తీకి మరో 1800 కోట్లు

 పుష్కరాలకు రూ. 100 కోట్లు ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. {పత్యేక హోదా పరిశీలనలో ఉంది.
     ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి
 సాక్షి, న్యూఢిల్లీ: పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పొందుపరిచిన హామీలన్నీ నెరవేర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి మంగళవారం చివరి రోజు కావడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై అరుణ్ జైట్లీతో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అరుణ్‌జైట్లీ  ఏపీకి ఇచ్చిన నిధుల గురించి వివరించారు.  
 ఇవీ ముఖ్యాంశాలు..
 రెవెన్యూలోటు: ఏపీ రెవెన్యూ లోటు భర్తీచేసేందుకు ఇదివరకే ఇచ్చిన రూ.500 కోట్లుకు అదనంగా మరో రూ.1,800 కోట్లు విడుదల  చేస్తున్నట్టు జైట్లీ ప్రకటించారు. 2014-15 అకౌంట్లు పూర్తయిన తరువాత సమీక్షించి తదుపరి కార్యాచరణ చేపడతామని తెలిపారు.
 రాజధానికి సాయం: కొత్త రాజధానిలో రోడ్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వసతుల ఏర్పాటుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేశారు. అలాగే రాజ్‌భవన్ తదితర భవనాల నిర్మాణానికి రూ. 500 కోట్లు విడుదల చేశారు.
 సీమ, ఉత్తరాంధ్రలకు: వెనకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రూ. 350 కోట్లు విడుదల చేశామని, రాష్ట్రంలో అసమానతకు గురైన ప్రాంతాలను అభివృద్ధిచేసేందుకు సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
 పారిశ్రామికాభివృద్ధి: ఏపీలో నెలకొల్పే పరిశ్రమలకు ఐదేళ్ల పాటు 15 శాతం అదనపు డిప్రిసియేషన్, 15 శాతం క్యాపిటల్ అలవెన్స్ ప్రకటించారు.
 పోలవరం ప్రాజెక్టు: ప్రాజెక్టు నిర్మాణం వేగవంతానికి నిధుల విడుదలు చేయడంతోపాటు.. 2014-15లో ప్రాజెక్టుకు అయిన వ్యయాన్ని రీయింబర్స్ చేశామని తెలిపారు.
 గోదావరి పుష్కరాలు: గోదావరి పుష్కరాల ప్రాముఖ్యాన్ని బట్టి వాటికి అవసరమైన పనులు పూర్తయ్యేందుకు వీలుగా రూ.100 కోట్లు విడుదల చేశారు.
 ఆర్థిక సంఘం గ్రాంట్లు: 13వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆధారంగా ఏపీకి ఇవ్వాల్సిన రూ. 3,677.28 కోట్లు విడుదల చేసినట్టు జైట్లీ తెలిపారు. వీటిలో పునరుత్పాదక ఇంధన శక్తికి రూ. 137.66 కోట్లు, అదనపు పర్‌ఫార్మెన్స్ గ్రాంటు కింద రూ. 59 కోట్లు కూడా ఉన్నాయి.
 ఇతర నిధులు: చిన్న మొత్తాల పొదుపు ద్వారా రూ.549 కోట్లు, అలాగే సెంట్రల్ సేల్స్ టాక్స్(సీఎస్టీ) పరిహారం కింద రూ. 610 కోట్లు విడుదల చేశారు. ఐసీడీఎస్‌కు అదనంగా రూ.30 కోట్లు విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి రూ. 42.6 కోట్లు కేటాయించారు.
 స్పెషల్ కేటగిరీ స్టేటస్: ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేయడం కేంద్ర పరిశీలనలో ఉందని జైట్లీ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో స్పెషల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపరాదని ఉండడంతో ఏపీకి ఇచ్చిన హామీని, 14 వ ఆర్థిక సంఘం చేసిన సిపారసులను రెండింటి ని బేరీజు వేస్తూ పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలను, ప్రధాన మంత్రి చేసిన హామీలను నెరవేర్చడంలో మేం పూర్తిగా కట్టుబడి ఉన్నందున త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని జైట్లీ వివరించారు. తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించగా.. తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
 అసంతృప్తికి కారణమేమీ లేదు:
 సుజనా, కంభంపాటి
 కేంద్రం విడుదల చేసిన నిధులపై సంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నకు బదులుగా సుజనాచౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు సమాధానమిస్తూ.. తాము దాదాపు రూ. 10 వేల కోట్లు విడుదల చేయించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మొత్తంగా రూ. 8,108 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. అసంతృప్తి ఉండడానికి కారణాల్లేవని బదులిచ్చారు.
 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31లోపు
 విడుదలైన నిధుల వివరాలు (రూ. కోట్లలో)
 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లు    2,377
 రెవెన్యూలోటు    2,300
 రాజధానికి సాయం    1,500
 వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ    350
 పోలవరం ప్రాజెక్టు    250
 గోదావరి పుష్కరాలు    100
 చిన్న మొత్తాల పొదుపు నిధి    549
 సీఎస్టీ పరిహారం    610
 అదనపు కేంద్ర సాయం    72.60
 మొత్తం    8,108.60

మరిన్ని వార్తలు