19 మందిపై క్రిమినల్ కేసు

8 Feb, 2014 00:32 IST|Sakshi

పాడేరు, న్యూస్‌లైన్:  పాడేరు ఐటీడీఏ పరిధిలో  2013 స్పెషల్ డీఎస్సీకి గతేడాది సెప్టెంబర్‌లో  తప్పుడు ధ్రువపత్రాలను అందజేసి అక్రమంగా ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నించిన 19 మంది గిరిజన అభ్యర్థులపై  పాడేరు పోలీసు స్టేషన్‌లో శుక్రవారం క్రిమినల్ కేసు నమోదయింది. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన టెట్, ఇతర విద్యార్హత ధ్రువపత్రాలకు మార్కుల జాబితాను ఫోర్జరీ చేసి ఎక్కువ మార్కులుగా దిద్దుబాటుతో 19 మంది గిరిజన అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారు సమర్పించిన  ధ్రువపత్రాలు, ఒరిజినల్ మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో అధికారులు  పరిశీలించగా అవి తప్పుడివిగా తేలాయి.

ఈమేరకు గిరిజన సంక్షేమశాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి  జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు. ఆయన విచారణ అనంతరం క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశించారు.  డీడీ ఫిర్యాదు మేరకు పాడేరు ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ 420 సెక్షన్ కింద ఆయా అభ్యర్థులపై  కేసు నమోదు చేశారు. కేసు నమోదు అయిన వారిలో డుంబ్రిగుడ మండలానికి చెందిన ఎస్.మత్స్యరాజు, ఎస్.రూపవతి, ఎం.రామ్‌ప్రసాద్, జి.బొంజుబాబు, పాడేరు మండలానికి చెందిన ఎ.ఈశ్వరి, ఎస్.సింహాచలం, సి.జాన్సిలక్ష్మీ, పెదబయలు మండలానికి చెందిన ఆర్.రాజారావు, పి.ఆనందరావు, డి.రాంబాబు, పి.రమ్యజోషి, చింతపల్లి మండలానికి చెందిన ఎస్.నర్సింగరావు, జె.సత్యవతి, ముంచంగిపుట్టు మండలానికి చెందిన వి.రమేష్‌కుమార్, పి.పరశురాం, కె.దాసు, జి.మాడుగుల మండలానికి చెందిన కె.చినతల్లి, జీకే వీధి మండలానికి చెందిన ఎం.ధర్మయ్య, కొయ్యూరు మండలానికి చెందిన ఎల్.సింహాచలంలు ఉన్నారు.  కేసు వివరాలను పోలీసు ఉన్నతాధికారులకు నివేదించి వారి ఆదేశాల మేరకు  వెంటనే అరెస్టు చేస్తామని ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్  తెలిపారు.
 

మరిన్ని వార్తలు