రాష్ట్రానికి 2.58 లక్షల ఇళ్లు

28 Nov, 2019 04:20 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పట్టణ గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రానికి 2,58,648 గృహాల్ని కేంద్రం మంజూరు చేసింది. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక(డీపీఆర్‌)ను పట్టణ గృహ నిర్మాణంపై బుధవారం ఢిల్లీలో జరిగిన మంజూరు–పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమోదించారు.

57,629 గృహాలు పట్టణ ప్రాంతాల్లో, 2,01,019 గృహాలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో మంజూరయ్యాయి. ఈ గృహాల ప్రాజెక్టు విలువ రూ. 7,042.50 కోట్లు కాగా ఇందులో కేంద్రం వాటా రూ. 3,879.72 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 1,581.39 కోట్లు, లబ్ధిదారుడి వాటా లేదా బ్యాంకు రుణం రూ. 1,581.39 కోట్లు. గత నెలలో మంజూరైన 1,24,624 గృహాలతో కలిపితే మొత్తం 3,83,272 గృహాలు రాష్ట్రానికి మంజూరయ్యాయి.   

మరిన్ని వార్తలు