విషం తాగిన విద్యార్థుల్లో ఇద్దరు మృతి

25 Jun, 2015 10:45 IST|Sakshi

అనంతపురం : చదువుకోవడం ఇష్టం లేక అనంతపురం జిల్లాలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు గురువారం తెల్లవారుజామున మృతిచెందారు. బెంగళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజమునీశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ లు చనిపోయారు. మరో విద్యార్ధి చంద్రశేఖర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

యాడికి మండలం పుప్పాల యంగన్నపల్లికి చెందిన ముగ్గురు విద్యార్థులు బుధవారం విషపు గుళికలు తిని ఆత్మహత్యకు యత్నించారు. వీరు స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. గత కొంతకాలంగా చదువు అంటే ఇష్టం లేదని, స్కూల్ కి వెళ్లమని కుటుండసభ్యులకు చెప్పేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం స్కూల్ కు వెళ్లి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండ వద్దకు చేరుకుని అక్కడ విషపు గుళికలను కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగారు.

కొద్దిసేపటి తర్వాత స్థానికులు గమనించి పెద్దవడుగూరు ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. అయినా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరు లోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఇద్దరు విద్యార్థులు మరణించారు.
(యాడికి)

మరిన్ని వార్తలు