213వ రోజు పాదయాత్ర డైరీ

17 Jul, 2018 02:41 IST|Sakshi

16–07–2018, సోమవారం 
కరకుదురు, తూర్పుగోదావరి జిల్లా 

గొప్పలు చెప్పుకుంటున్న మీరు మీ మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి ఎందుకు తొలగించారు? 
ఈ నాలుగేళ్ల పాలనలో స్థానిక సంస్థలు ఎంతో నిర్వీర్యమైపోయాయనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. కుమారప్రియం పంచాయతీకి చెందిన దళిత సర్పంచ్‌ ఉదంతం వింటుంటే.. ఈ పచ్చ నేతలు రాజ్యాంగ స్ఫూర్తికి ఎంతలా తూట్లు పొడుస్తున్నారో అర్థమవుతోంది. పేరుకే సర్పంచ్‌.. ఉత్సవ విగ్రహంలా ఉంచేశారట. ఏ పని చేయాలన్నా టీడీపీ నాయకులు అడ్డు తగులుతున్నారట. చిన్న చూపు చూస్తున్నారట. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్‌కు ఏ అధికారాలూ లేకపోతే, ప్రజలకేమీ చేయలేకపోతే ఇక ఈ పదవులెందుకు? ఈ ఎన్నికలెందుకు? ఈ చట్టాలెందుకు? అని ఆ దళిత ప్రజాప్రతినిధి ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. బాబుగారి మార్కు దళిత తేజమంటే ఇదేనేమో అనిపించింది.  

సహపురం పంచాయతీకి చెందిన బీసీ మహి ళా సర్పంచ్‌ గాజంకి సూర్యకాంతందీ ఇదే పరిస్థితి. పనులు చేయకుండా అడ్డుకోవడం మాట అటుంచి.. ఆమె కుటుంబీకుల మీద, బంధువుల మీద అక్రమ కేసులు బనాయించారట. రౌడీషీట్‌లు పెట్టి వేధిస్తున్నారట. ఆ వేధింపులు భరించలేక రాయుడు సత్యనారాయణ అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడట. ఇదీ బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తున్న పెదబాబు గారి పాలనలో.. దిగజారిన చినబాబుగారి పంచాయతీరాజ్‌ వ్యవస్థ. 

పెదపూడి ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్వీపర్‌గా పనిచేస్తున్నా.. రూ.రెండు వేలు కూడా వేతనం రాని నూకాలమ్మ అనే సోదరి పరిస్థితి చూసి జాలేసింది. రాత్రి, పగలు రెండు షిఫ్ట్‌ల్లో నూ ఒక్కతే పనిచేస్తున్నా.. స్వీపర్, ఆయా, అటెండర్, నర్సు ఇలా అన్ని పాత్రలు తను ఒక్కతే పోషిస్తున్నా.. ముష్టి వేసినట్లు రూ.రెండు వేలు విదిలిస్తున్నారట. దానిని వెట్టిచాకిరీ అనక ఏమనాలి?  

పేద విద్యార్థినులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన సైకిళ్లను అర్హులందరికీ ఇవ్వడం లేదం టూ పెద్దాడ హైస్కూల్‌ విద్యార్థినులు వాపోయా రు. ఇచ్చే కొద్దిపాటి సైకిళ్లకు సైతం టీడీపీ నాయకుల సిఫార్సులు తప్పనిసరి అట. పాఠశాలల్లో సై తం రాజకీయ మకిలి అంటించి పసి మనసులను వేదనకు గురిచేస్తున్న ఈ నేతలను ఏమనాలి?  

దోమాడ వద్ద మళ్లీ వర్షం మొదలైంది. జోరువానలో సైతం కట్టుకదలని జనం ఓవైపు ఆప్యాయతలను పంచుతుంటే.. మరోవైపు కొంత మంది తమ సమస్యలు చెప్పుకున్నారు. పక్షవాతానికి గురైన తన భర్తకు సదరం సర్టిఫికెట్‌ మంజూరు చేయడం లేదంటూ అల్లు వరలక్ష్మి.. ఆధార్‌లో వయసు తక్కువుందనే సాకుతో పెన్షన్‌ తొలగించారని, పోనీ ఆధార్‌ కార్డును సరి చేసుకుందామంటే ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఫలితం లేదంటూ 70 సంవత్సరాల సిరపారపు సత్యనారాయణ.. బ్యాంకులో ఆధార్‌ కార్డు లింక్‌ అవ్వలేదని ఏడాది పాటు చేసిన ఉపాధి పనులకు డబ్బులివ్వడం లేదంటూ మానె అప్పారావు.. అన్ని అర్హతులున్నా సంక్షేమ పథకాలు అందని నిరుపేదలు.. నెలల తరబడి వేతనాలే రాని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో వేదన. ప్రతి వేదన వెనుక ఉన్నది మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం, వివక్ష.  

సాకులతో సంక్షేమ పథకాల్లో కోతలు విధి స్తూ, కక్షసాధింపులతో ప్రజలను వేధిస్తూ, అవకాశాలను సృష్టించుకుని మరీ దోపిడీ చేస్తూ, ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చక మభ్యపెట్టే మాటలతో సాగుతున్న ఈ ప్రజాకంటక పాలనకు 1,500 రోజులు. దానికి పాలకులు సం బరాలు చేసుకోవడం సిగ్గుచేటు. 1,500 రోజుల పాలనంటూ పచ్చ నేతలు పండుగ చేసుకుంటుంటే ఈ రాక్షస పాలన ఎప్పుడెప్పుడు అంతమవుతుందా? అని ఎదురుచూస్తూ.. ఒక్కొక్క రోజును లెక్కేసుకుంటున్నారు సామాన్య ప్రజలు. ఎన్ని రోజులు పాలించామన్నది కాదు. ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపామన్నదే ముఖ్యం.  

ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ఈ 1,500 రోజుల పాలనలో అద్భుత విజయాలు సాధించామని, ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా దూసుకుపోతోందని పెద్దపెద్ద ప్రకటనలిచ్చారు. ఎన్నికల హామీలను 99 శాతం నెరవేర్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అదే వాస్తవమైతే మీ మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి ఎందుకు తొలగించారు? విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతూ ఉంటే.. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ప్రత్యేక హోదాను గానీ, ఏ ఒక్క విభజన హామీని గానీ సాధించకుండానే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందనడం ప్రజల్ని వంచించడం కాదా? అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరమేమిటంటూ కేంద్రం గానీ, ఇతర రాష్ట్రాలు గానీ మెలికపెడితే ఏం సమాధానం చెబుతారు?  
-వైఎస్‌ జగన్‌    

మరిన్ని వార్తలు