ప్రకాశం: జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీటి సరఫరా

9 Sep, 2019 11:34 IST|Sakshi

సాక్షి, ప్రకాశం(త్రిపురాంతకం) : నాగార్జున సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు 2,250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. సాగర్‌ ప్రధాన కాలువ ద్వారా జిల్లాకు నీటి సరఫరా క్రమేనా పెరుగుతోంది. దాంతో మేజర్లకు అవసరమైన మేర నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో డ్యాములు నిండి వరద నీరు ప్రవహించడంతో ప్రధాన కాలువకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి చెరువులు నింపాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. ఇదే విధంగా మేజర్లకు పూర్తిగా నీరు విడుదల చేయాలన్న డిమాండ్‌ రైతుల నుంచి వ్యక్తమవుతోంది. పూర్తిగా నీటిని విడుదల చేస్తే త్వరితగతిన నారుమళ్లు పోసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే నారుమళ్లు పెంచిన రైతులు వరినాట్లను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని రైతులు, రైతు సంఘ ప్రతినిధులు సాగర్‌ అధికారులను కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు