239 లే అవుట్‌లపై చర్యకు నివేదిక

10 Jan, 2014 03:42 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: జిల్లాలో అనుమతుల్లేని లే అవుట్‌లను కొనుగోలు చేయవద్దని జిల్లా టౌన్‌ప్లానింగ్ అధికారి టీ లక్ష్మణ్‌గౌడ్ అన్నారు. గురువారం భద్రాచలం వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం పదివేలలోపు జనాభా ఉన్న అన్ని గ్రామాల్లో 20సంవత్సరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే ఖమ్మం పట్టణానికి ఆనుకుని ఉన్న పిండిప్రోలు, జీళ్లచెరువు, మంచుకొండ, దెందుకూరు, తనికెళ్ల, శివాయిగూడెం, మద్దులపల్లి గ్రామాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లుగా చెప్పారు. డీటీసీపీఓ అనుమతిలేని లే అవుట్‌లపై కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా స్థలంపై యజమాని హక్కు పత్రాలు, ఉన్న స్థలంలో 25 నుంచి 30 శాతం మేర రోడ్లకు కేటాయింపు, మరో పది శాతం గ్రీన్‌బెల్టు ఏర్పాటు నిమిత్తం పంచాయ తీ వారికి అప్పగించినట్లు తగిన ధ్రువీకరణ పత్రం ఉంటేనే ఇంటి స్థలం కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలో 239 లే అవుట్‌లకు యజమానులు తగిన నిబంధనలు పాటించలేదని వారిపై తగు చర్య నిమిత్తం జిల్లా కలెక్టర్‌కు నివేదించామన్నారు. తగిన ధ్రువీకరణ లేని స్థలాల్లో ఇంటి నిర్మాణాలకు పంచాయతీ కార్యదర్శులు అనుమతులు ఇవ్వడానికి వీల్లేదన్నా రు.
 
 నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు లేఖ నివేదిస్తామన్నారు. ప్రతీ పంచాయతీలో 9 రకాల రికార్డులను నిర్వహించాలన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జోరుగా సాగుతున్న తరుణంలో కొనుగోలుదారులను అప్రమత్తం చేసేందుకు అన్ని మండలాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎంపీడీఓ స్థాయిలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులను భాగస్వామ్యులను చేస్తామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టానికి లోబడే లే అవుట్ ఏర్పాటు జరగాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వేసే లే అవుట్‌లను కొనుగోలు చేసిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ స్థలాలపై హక్కు సంక్రమించే పరిస్థితి ఉండదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వారు కొనుగోలు దారులకు ఇబ్బందుల్లేకుండా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాతే లే అవుట్‌లు వేయాలన్నారు.

మరిన్ని వార్తలు