భార్య, అత్తమామలే కారణం..

9 Apr, 2017 11:42 IST|Sakshi
భార్య, అత్తమామలే కారణం..

► ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
► తన చావుకు భార్య, అత్తమామలే కారణమంటూ సూసైడ్‌ నోట్‌
► నలుగురిపై కేసు నమోదు

వారిద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. నువ్వులేకనేను లేనని బాసలు చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. సజావుగా సాగుతున్న వీరి సంసారంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. ఏడాది క్రితం విడిపోయారు. పుట్టినింటికి చేరుకున్న భార్య తల్లిదండ్రులు, ప్రియుడితో కలిసి భర్తపై ప్రతీకార చర్యలకు పాల్పడింది. దీంతో జీవితంపై విరక్తిచెందిన అతను తన చావుకు భార్య, ఆమె ప్రియుడు, అత్తామామలు, బావమరిది కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది.

మదనపల్లె క్రైం: కొత్తవారిపల్లె పంచాయతీ యనమలవారిపల్లెలో నివాసముంటున్న డేనియల్‌ కుమారుడు కె.స్వరాజ్‌కుమార్‌ (26) మదనపల్లెలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. కళాశాలకు వచ్చి వెళ్లే సమయంలో పట్టణంలోని ఇందిరానగర్‌లోని షేక్‌ హుస్సేన్, బషీరున్నీషా దంపతుల కుమార్తె యాస్మిన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిది. నాలుగేళ్ల తర్వాత పెద్దలను ఎదిరించి మతాంతర వివాహం చేసుకున్నారు. వీరి కాపురం మూడేళ్లుసజావుగా సాగింది.

ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ భార్యను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భర్త అంగీకారంతో యాస్మిన్‌ మదనపల్లెలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో పనిచేస్తోంది. ఈ క్రమంలో అక్కడ పనిచేసే శ్రీనివాసులుతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు పడేవారు. ఆమె పుట్టినింటికి చేరుకుని తల్లిదండ్రులు, ప్రియుడి సాయంతో భర్త స్వరాజ్‌కుమార్‌పై స్థానిక టూటౌన్‌లో కేసులు పెట్టింది.

వీరి వేధింపులు తాళలేక స్వరాజ్‌కుమార్‌ జీవితంపై విరక్తి చెంది సూసైడ్‌ నోట్‌ రాసి నివాసం ఉంటున్న ఇంటి పైకప్పుకు సర్వీస్‌ వైర్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వరాజ్‌కుమార్‌ మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రవిప్రకాష్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు