29 నుంచి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ సమీక్షలు

28 May, 2014 00:17 IST|Sakshi

13 జిల్లాలకు త్రిసభ్య కమిటీల ఏర్పాటు
 
హైదరాబాద్: ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 29 నుంచి నాలుగు రోజులపాటు సమీక్షలు చేపట్టనుంది. సీమాంధ్రలోని 13 జిల్లా కేంద్రాల్లో ఈ సమీక్షలు విడివిడిగా జరుగుతాయి. సమీక్షా సమావేశాల నిర్వహణకు ఒక్కొక్క జిల్లాకు విడివిడిగా అనుభవజ్ఞులైన నేతలతో త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు, ఓటములకు దారితీసిన పరిస్థితులపై ఈ సందర్భంగా లోతైన అధ్యయనం, విశ్లేషణ జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ నెల 29వ తేదీన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప , 30న కృష్ణా, అనంతపురం,  31న కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, జూన్ 1వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాల్లో సమీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు వర్తమానం పంపారు.
 
 

మరిన్ని వార్తలు