కాకినాడ తీరంలో 30 కిలోల కచ్చిడి చేప లభ్యం
వేలంలో రూ. 2.05 లక్షల ధర పలికిన మీనం
ఈ చిత్రంలో కనిపిస్తున్న చేప పేరు కచ్చిడి. ఈ చేప వలకు చిక్కితే మత్స్యకారులకు కాసుల పంటే. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిని మందుల తయారీలో ఉపయోగిస్తారు. అందువల్ల కచ్చిడి చేపను అధిక ధరకు కొనుగోలు చేస్తారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు చిక్కిన కచ్చిడి సుమారు 30 కేజీల బరువుంది. ఆదివారం కుంభాభిషేకం రేవులో దీనిని వేలం వేయగా రూ.2.05 లక్షల ధర పలికింది. గతంలోనూ కచ్చిడి చేప రూ.1.80 లక్షలు పలకగా.. ఈసారి అంతకుమించి రేటు వచ్చింది. కాకినాడకు చెందిన వ్యాపారి కచ్చిడి చేపను కొనుగోలు చేసి దానిని హౌరాకు పంపించారు.
– సర్పవరం (కాకినాడ రూరల్)