ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్ :
ఇబ్రహీంపట్నం సమీపంలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు వేల మందికి ఉపాధి దొరకనుంది. వైట్గోల్డ్ ఇంటిగ్రేటెడ్ సంస్థ ఈ పార్కు నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తోంది. మొత్తం రూ. 500కోట్ల వ్యయంతో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇబ్రహీంపట్నం ఖాల్సాలో సర్వే నంబర్ 257లో మొత్తం 135 ఎకరాలను టెక్స్టైల్ పార్కుకు ప్రభుత్వం కేటాయించింది. ఇబ్రహీంపట్నం సమీపంలో నాగన్పల్లి రోడ్డు మార్గానికి ఇరువైపులా పార్కుకు భూమి కేటాయింపు జరిగింది.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ముగియగానే పార్కు నిర్మాణం పనులను ప్రారంభిస్తామని వైట్గోల్డ్ సంస్థ ప్రతినిధి ఒకరు ‘న్యూస్లైన్’కు తెలిపారు. టెక్స్టైల్ పార్కు నిర్మాణంతో ఈ ప్రాంతంలో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.