ఖైదీల్లో ఆనంద హేల..

22 Dec, 2013 03:37 IST|Sakshi

 విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ కేంద్రకారాగారం జీవిత ఖైదీల్లో ఆనందం నెలకొంది. జీవిత ఖైదు అనుభవిస్తూ ఏళ్ల తరబడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఖైదీలకు ప్రభుత్వం ఎట్టకేలకు  క్షమాభిక్ష పెట్టింది. రాష్ట్రంలో క్షమాభిక్షకు అర్హులైన 398 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు పంపించింది. దీంతో ఇక్కడ కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిలో అర్హులైన 37 మంది విడుదలకు మార్గం సుగమమయింది. ఈ మేరకు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శనివారం రాత్రి ఇక్కడ జైలు అధికారులకు ఉత్తర్వులందాయి. రాత్రికి రాత్రే వారిని విడుదల చేయాలని అదేశాలు రావడంతో అఘమేగాలపై అర్హులైన ఖైదీల రికార్డులు తయారు చేశారు.

వారిలో అర్ధరాత్రి దాటిన తర్వాత 36 మంది ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మరో ఖైదీ పెరోల్‌పై ఉన్నాడు. ఆ ఖైదీ వ చ్చిన వెంటనే క్షమాభిక్షపై విడుదల కానున్నాడు. విడుదలైన వారిలో 65 ఏళ్లు దాటిన ఇద్దరు వృద్ధులు, మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఎడాది గాంధీ జయంతి సందర్భంగా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 28న క్షమాభిక్ష జీవోను విడుదల చేసింది. గాంధీ జయంతి నాటికి జీవోలో నిబంధనల ప్రకారం జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు చేరడానికి ఎక్కువ సమయం పట్టడంతో అప్పట్లో ఖైదీల విడుదలకు జాప్యం జరిగింది.

ఆ జీవో ప్రకారం సిద్ధం చేసిన జాబితాను పరిశీలించి వారిలో అర్హులైన వారిని వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులకు ఉత్తర్వులు పంపింది. సెప్టెంబరులో జారీ అయిన జీవో ప్రకారం విశాఖ కారాగారంలో విడుదలకు అర్హులైన సుమారు 40 మంది జీవిత ఖైదీల జాబితాను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. వారిలో 37 మం ది అర్హులుగా తేల్చి వారి విడుదలకు ఆదేశాలు ఇచ్చారు. వారిలో ఓపెన్ ఎ యిర్ జైల్‌కు చెందిన వారు 20 మంది, మిగిలిన వారు 17 మంది ఉన్నారు.
 రెండేళ్ల తర్వాత ఇదే విడుదల..
 గతంలో 2011 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ నుంచి 36 మంది జీవిత ఖైదీలను విడుదల చేశారు. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ క్షమాభిక్ష జీవో విడుదల చేకుండా ప్రభుత్వం ఆలస్యం చే సింది. ఇప్పటికైనా విడుదల చేసినందుకు ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటామని అంటున్నారు. జైల్లో పరివర్తనం చెందామని, సమాజంలో నీతిగా మెలుగుతామని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు