ఢిల్లీ వెళ్లిన వారెవరు

1 Apr, 2020 11:29 IST|Sakshi
వేంపల్లెలో స్ప్రే చేస్తున్న మున్సిపల్‌ అధికారులు

జమాత్‌కు వెళ్లిన వారిపై దృష్టి

జిల్లాలో విస్తృతంగా గుర్తింపు చర్యలు

జిల్లా ఆస్పత్రిలోని క్వారంటైన్‌

సెంటర్‌లో చికిత్స ఇప్పటివరకూ 39మంది గుర్తింపు

ప్రొద్దుటూరు క్రైం : డిల్లీ జమాత్‌కు వెళ్లి వచ్చిన జిల్లావాసులను గుర్తించే ప్రక్రియ మొదలైంది.  ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికపై జిల్లాను జల్లెడ పట్టారు.  జిల్లా నుంచి 59మంది వెళ్లినట్లు భావిస్తున్నారు.  వివిధ ప్రాంతాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. మంగళవారం ఢిల్లీ జమాత్‌ అంశం చర్చనీయాంశమైంది. 25 మంది ప్రొద్దుటూరు వాసులను గుర్తించారు. ఈ మేరకు వారిని జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వారితో పాటు విశాఖపట్నం, అజ్మీర్‌కు వెళ్లి వచ్చిన  మరో ముగ్గురిని కూడా క్వారంటైన్‌ సెంటర్‌కు పంపించారు. రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. చాపాడు ఎస్‌ఐ మహ్మద్‌రఫి మంగళవారం ఆస్పత్రికి చేరుకొని క్వారంటైన్‌లో ఉన్న వారితో మాట్లాడారు. వారికి సమకూర్చాల్సిన ఆహారం, ఇతరత్రా సౌకర్యాల గురించి ఎస్‌ఐ అడిగి తెలుసుకున్నారు.  భయపడాల్సిన అవసరం లేదని, అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానిక వైద్యులతో పాటు డీఎస్పీ సుధాకర్, సీఐలు విశ్వనాథ్‌రెడ్డి, నరసింహారెడ్డి, నాగరాజు, ఎస్‌ఐలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

వేంపల్లె : వేంపల్లె వాసులను ఏడుగురిని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం అధికారులు సర్వే చేసి వారిని కడప రిమ్స్‌ ఆసుపత్రికి పరీక్షలకు పంపించారు. ఇంకా వారు ఎక్కడికి వెళ్లారో.. వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నారన్న విషయాలను విచారణ చేస్తున్నారు. 

పులివెందుల రూరల్‌ : పులివెందులకు చెందిన ఏడుగురిని కడప రిమ్స్‌కు తరలించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నరసింహారెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మురళీధర్‌లు పట్టణంలో వారు నివసిస్తున్న  ప్రాంతాలలో సోడియం హై కార్పొరేడ్‌ను స్ప్రే చల్లించారు.

రాయచోటి : రాయచోటి ప్రాంతంలో మంగళవారం రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లతో కలిసి గుర్తింపు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో ఢిల్లీ జమాత్‌ 16 మంది వెళ్లినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించిన అధికారులు మిగిలిన వారి కోసం తీవ్రంగా వెతుకుతున్నారు.

మరిన్ని వార్తలు