కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్‌

25 Jul, 2019 10:57 IST|Sakshi

సాక్షి, మండపేట : కిడ్నాపర్ల చెర నుంచి బయటపడ్డ జసిత్‌ పలు కీలక విషయాలు వెల్లడించాడు. నానమ్మతో కలిసి ఆడుకుంటుండగా ఎవరో వచ్చి తనను తీసుకెళ్లారని.. వేరే ఊరికి తీసివెళ్లి దాచిపెట్టారని తెలిపాడు. కిడ్నాపర్లలో ఒకరు తనకు తెలిసిన వ్యక్తే అని బాలుడు చెప్పినట్టు సమాచారం. ‘రాజు అనే వ్యక్తి తనను బైక్‌పై దించేసి వెళ్లాడు. తినడానికి రోజూ ఇడ్లీ పెట్టారు. కిడ్నాపర్లు నన్ను ఏమీ అనలేదు. కొట్టలేదు. అందరికీ థాంక్స్‌’ అంటూ జసిత్‌ ‘సాక్షి’తో చెప్పాడు. కాగా, మూడు రోజుల క్రితం జసిత్‌ను కిడ్నాప్‌ చేసిన దుండగులు గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లిన సంగతి తెలిసిందే.
(చదవండి : జసిత్‌ను వదిలిపెట్టిన కిడ్నాపర్లు..!)

పోలీసులపై ప్రశంసలు..
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. జసిత్‌ ఆచూకీ కోసం 500 మంది పోలీసులు 17 ప్రత్యేక బృందాలుగా రెండు రోజుల నుంచి జల్లెడ పట్టిన సంగతి తెలిసిందూ. పోలీసులు ముమ్మర గాలింపు చర్యలతో బెదిరిపోయిన దుండగులు ఎట్టకేలకు జసిత్‌ను విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. జసిత్‌ రాకతో ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. జసిత్‌ను ఎవరు కిడ్నాప్‌ చేశారో.. ఎందుకు కిడ్నాప్‌ చేశారో ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు