40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు : కన్నబాబు

18 May, 2020 17:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా ముందుగానే విత్తన సరఫరా ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే రైతు భరోసా డబ్బు వేశామని తెలిపారు. ఆ డబ్బు రైతుకు చేరగానే విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. 

నేటి నుంచి వేరుశనగ విత్తన కాయలు 40 శాతం సబ్సిడీతో అందిస్తున్నాం. వరి, ఇతర పంటల విత్తనాల సరఫరా కూడా జరుగుతోంది. నాణ్యతను అధిక ప్రాధాన్యం ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామస్థాయిలో విత్తనాలు అందిస్తున్నాం. గతంలోలా భారీ క్యూ లైన్లు లేకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి రైతుకు అందిస్తున్నాం. దీని వల్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా అరికడుతున్నాం. ఎక్కడైనా అవినీతి జరిగిందని మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

విత్తన పంపిణీ కోసం జిల్లాకో ప్రత్యేక అధికారిని కూడా పంపాము. రైతు భరోసా కేంద్రాలు ఈ నెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రారంభిస్తారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అవి రాగానే గ్రామ స్థాయి నుంచి రైతు సేవలు ప్రారంభం అవుతాయి. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆర్బీకేల ప్రారంభం ద్వారా రైతు సేవలో పునరంకితమవుతాం అని  మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

మరిన్ని వార్తలు