రెండు చోట్ల 47 ఎర్రచందనం దుంగల పట్టివేత

24 May, 2015 05:43 IST|Sakshi

పట్టుకున్న దుంగల బరువు 340 కేజీలు
చెన్నుపల్లెకు చెందిన నలుగురి అరె స్టు
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
 

 బేస్తవారిపేట : మండలంలోని పగుళ్లవాగు వద్ద 32, నారువానిపల్లెలో 15 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నట్లు మార్కాపురం డీఎస్పీ ఆర్.శ్రీహరిబాబు శనివారం వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఫారెస్ట్ టాస్క్‌ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు రెండు రోజులుగా గిద్దలూరు సీఐ మహ్మద్ ఫిరోజ్, ఎస్సై బి.రమేష్‌బాబుల ఆధ్వర్యంలో పోలీస్‌లు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు చెప్పారు. గలిజేరుగుళ్ల, చెన్నుపల్లె, శింగరపల్లె, శింగసానిపల్లె, కోనపల్లె, నారువానిపల్లె కొండ ప్రాంతాలు, అనుమానితుల గృహాల్లో తనిఖీలు నిర్వహించామని డీఎస్పీ చెప్పారు.

చెన్నుపల్లెకు చెందిన నారు చెంచయ్య, పెదమల్లు వెంకటేశ్వర్లు, వీరపునేని వెంకటేశ్వర్లు, చినకొండ వెంకటేశ్వర్లు, వీరినేని చెంచయ్య, లింగయ్యలు అడవిలోని ఎర్రచందనం చెట్లు నరికి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుండగా వారి కుట్రలను భగ్నం చేసినట్లు వివరించారు. చెంచయ్య, లింగయ్యలు పరారిలో ఉన్నారని, మిగిలిన నలుగురిని అరె స్టు చేసినట్లు పేర్కొన్నారు. 47 ఎర్ర చందనం దుంగలు 340 కేజీల బరువు ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం రవాణాపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందన్నారు. శుక్రవారం రాత్రంతా అడవిలో తిరిగి ఎర్రచందనం పట్టుకున్న ఎస్సై బి.రమేష్‌బాబును డీఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ మహ్మద్ ఫిరోజ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు