నిరుపేదలకు వెసులుబాటు 

10 Dec, 2019 08:50 IST|Sakshi

రూ.253లకే 5 కిలోల గ్యాస్‌ సిలెండర్‌ 

మైదాన ప్రాంతాలకూ 5కిలోల సిలిండర్లు 

ఒకేసారి పెద్ద మొత్తం పెట్టలేనివారికి ఊరట 

ప్రభుత్వ నిర్ణయంతో అట్టడుగు వర్గాల్లో ఆనందం 

బొబ్బిలి: నిరుపేదలకు గ్యాస్‌ బండలు విడిపించుకోవడంలో ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకున్న ప్రభుత్వం వారికి వెసులు బాటు కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గ్యాస్‌ కంపెనీలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో గిరిజన, గిరిశిఖర ప్రాంతాలకే కేటాయించిన 5 కిలోల సిలిండర్లను ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెస్తున్నాయి. జిల్లాలోని ఆయా ఏజెన్సీల ద్వారా పేదలు పొందిన గ్యాస్‌ కనెక్షన్లకు ఈ సిలిండర్లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం జిల్లాలోని నిరుపేదలయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏల్లో ఉన్న నిరుపేదలను గుర్తించి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అయితే ఇచ్చారు గానీ... విడిపించుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ సమస్యలను గుర్తించి వారికి అందుబాటులో ఉండే ధరల్లో సరఫరాచేయాలని భావిస్తున్నారు.ఇప్పటికే ఇటువంటి జాబితాలను ఆయా గ్యాస్‌ ఏజెన్సీలకు పంపించారు. ఆ జాబితాల్లో కొన్ని పేర్లు ఉండగా మరికొన్ని పేర్లను గుర్తించి వెంటనే గ్యాస్‌ కనెక్షన్‌లకు 5 కిలోల సిలిండర్‌ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

 నిరుపేదలను దృష్టిలో ఉంచుకునే... 
జిల్లా వ్యాప్తంగా 26 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. వీటి ద్వారా దీపం, సీఎస్‌ఆర్, ఉజ్వల, సాధారణ గ్యాస్‌ కనెక్షన్లు 5,50,000 ఉన్నాయి. అందులో ఎస్టీలు, ఎస్సీలు పొందిన కనెక్షన్లు అధికంగా ఉన్నప్పటికీ సిలిండర్‌ ధర రూ.703లు ఉండటంతో పేదలు విడిపించుకోలేకపోతున్నారు. ఇందుకోసం వారికి రెండేసి సిలిండర్లను ఇచ్చి గ్యాస్‌ కొనుగోలుకు వీలుగా రూ.253లకు 5కిలోల గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  వీరి కోసం ప్రస్తుతం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద వారికే ఈ సిలిండర్లు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లు ఇచ్చినప్పటికీ పెద్ద మొత్తం వెచ్చించి గా>్యస్‌ విడిపించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఈజీ గ్యాస్‌ కార్డులు.. 
గతంలో పుస్తకాలతో గ్యాస్‌ విడిపించుకునే వారు. ఇప్పుడు కొంత కాలంగా ఈజీ గ్యాస్‌ స్మార్ట్‌ కార్డులను పరిచయం చేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లోని నిరుపేదలకు కూడా ఈ ఈజీ గ్యాస్‌ కార్డులు, 5 కిలోల సిలిండర్లతో వినియోగం పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.  

5 కిలోల సిలిండర్లకు ప్రాధాన్యత: 
ఇప్పటికే ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించిన ప్రభుత్వం ఇప్పుడు విడిపించుకోలేని పేదలను గుర్తించి వారికి 5 కిలోల గ్యాస్‌ సిలెండర్లను అందించాలని ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం తామే అటువంటి వారిని గుర్తించి చిన్న సిలిండర్లను అందించే చర్యలు ప్రారంభించాం. ప్రతీ ఒక్కరూ తమ ఫోన్‌ నంబర్‌ను గ్యాస్‌ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌కు అందించాలి. దీనివల్ల వారికి అప్‌డేట్స్‌ ఇవ్వడం సులువవుతుంది.   
– జలగం ప్రసాదరావు, వెంకటేశ్వర గ్యాస్‌ ఏజెన్సీ   

మరిన్ని వార్తలు