చాంతాడులా చిట్టా

18 Feb, 2015 02:01 IST|Sakshi

50 మంది అరెస్ట్‌కు రంగం సిద్దం
పక్కదారి పట్టింది రూ.10కోట్లు పైమాటే.
అప్పటి ఏడీఎంహెచ్‌వో, పబ్లిక్ హెల్త్ డెరైక్టర్‌తో సహా వైద్యులూ నిందితులే...
అరెస్టయిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
వైద్య ఆరోగ్యశాఖను కుదిపేస్తున్న ట్రెజరీ కుంభకోణం

 
ట్రెజరీ కుంభకోణం వైద్య, ఆరోగ్యశాఖను కుదిపేస్తోంది. స్వాహా రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఏ క్షణాన్న ఎవరి అరెస్ట్ వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన వారి వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ప్రజారోగ్యశాఖ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్టుగా గుర్తించారు. నిందితుల చిట్టా చాంతాడులా సాగుతోంది. రూ.10కోట్ల మేర పక్కదారిపట్టినట్టు భోగట్టా.
 
విశాఖపట్నం: రాష్ర్ట వ్యాప్తంగా సంచలనమైన చిం తపల్లి ఉపఖజానా కుంభకోణంపై పోలీసులు సాగి స్తు న్న విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు విచారణా ధికారులనే విస్మయానికి గురిచేస్తున్నాయి. పీ హెచ్‌సీల్లో పనిచేసే కాం ట్రాక్టు ఉద్యోగుల జీత భత్యాల బడ్జెట్‌లో నకి లీ బిల్లులు సృష్టించి  2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3.6 కోట్లు పక్కదారిపట్టించారంటూ ఖజానాశాఖ డీడీ ఎం.గీతాదేవి గతేడాది నవంబర్ 27న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ అనంతరం జనవరి 29న ఈ కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసి రూ.1.71కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో సూత్రధారులు వీరైనప్పటికీ పాత్రధారులు ఎంతోమంది ఉన్నారని..వారిలో ప్రజారోగ్యశాఖ, వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నట్టుగా గుర్తించారు. 2009-10 నుంచి 2014-15 వరకు బడ్జెట్ కేటాయింపులు..చెల్లింపులకు సంబంధించి లోతైన పరిశీలన జరిపితే ఏకంగా రూ.10కోట్ల వరకు పక్కదారిపట్టినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలియ వచ్చింది.

ఇప్పటికే అరెస్ట్‌యన చింతపల్లి ఉపఖజనా కార్యాలయ సీనియర్ సహాయకుడు పెద అప్పలరాజుతో పాటు విశాఖలోని రాణిచంద్రమతిదేవి ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సాగిన సింహాచలం, పాడేరు అదనపు డీఎంఅహెచ్‌వో కార్యాల యంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పల్లాసంజీవరావులను పోలీసులు అరెస్ట్ చేయగా, వీరిలో అప్పలరాజుపై అరెస్టయిన రెండురోజులకే ఆశాఖ సస్పెండ్ వేటు వేసింది. సాగిసింహాచలం, పల్లా సంజీవరావులను సస్పెండ్ చేస్తూ ప్రాంతీయ వైద్యఆరోగ్యశాఖడెరైక్టర్ సోమరాజు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క ఈ కేసును ఛాలెంజ్‌గాతీసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అప్పటి డీఎంహెచ్‌వోతో పాటు ప్రజారోగ్యశాఖ డెరైక్టర్‌తో సహా 50 మందికి పైగా వైద్యఆరోగ్యశాఖకు చెందిన అధికారులు..సిబ్బంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. దారిమళ్లిన సొమ్ము ఏఏ ఖాతాలకు జమైంది. ఏవిధంగా జమైంది ఆరా తీశారు. డీడీ, చెక్కు నంబర్లతో సహా బ్యాంకుల వారీగా జాబితాలను సేకరించారు. కొంతమంది ఈ కేసుతోసంబంధం లేకపోయినా వారి అకౌంట్లకు ఈ నిధులు జమ చేసి వారి ద్వారానే డ్రా చేయించి అవినీతిచేపలు స్వాహా చేసినట్టుగా గుర్తించారు. అయినప్పటికీ ఈ సొమ్ము ఎవరెవరి ఖాతాలో జమైందో వారందరినీ నిందితుల జాబితాలో చేరుస్తున్నారు. ఈ చిట్టా ఏకంగా ఇప్పటికే 50కు చేరినట్టుగా సమాచారం.

జాబితాలో ఏజెన్సీ పరిధిలోని నలుగురు మెడికల్ ఆఫీసర్లు, ఆరడజను మంది స్టాఫ్‌నర్సులు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వీఆర్వోలు ఉన్నట్టుగా సమాచారం. కేసులో కీలకసూత్రధారులైన అప్పలరాజు, సింహాచలం, సంజీవ్‌కుమార్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నట్టుగా తెలియవచ్చింది. ఇప్పటికే అకౌంట్లలో సొమ్ములు జమైన వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టారు. త్వరలోనే ఈ కేసులో మలివిడత అరెస్టలుంటాయని పోలీసుఅధికారులు చెబుతున్నారు.అప్పలరాజును ఇరికించి ట్రెజరీలో మిగిలిన అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేవాదన బలంగా వినిపిస్తోంది. అలాగే ప్రజారోగ్యశాఖ, వైద్య ఆరోగ్యశాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు సైతం ఈకేసు నుంచి తప్పించుకునేందుకు రాజకీయంగా పావులు కదుపుతున్నట్టు తెలియవచ్చింది.
 

మరిన్ని వార్తలు