అజాగ్రత్తకు తప్పదు భారీ మూల్యం

21 Jul, 2020 04:55 IST|Sakshi

52% సైబర్‌ భద్రతను పట్టించుకోని  నెటిజన్లు

సేఫ్టీ విషయంలో అలసత్వం వల్లే పెరుగుతున్న మోసాలు

ఓఎల్‌ఎక్స్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి

సాక్షి, అమరావతి: నిత్య జీవితంలో డిజిటల్‌ కార్యకలాపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. నగదు లావాదేవీలు, ఆన్‌లైన్‌ షాపింగ్, బిల్లుల చెల్లింపు వంటి వాటిని మెజారిటీ వ్యక్తులు ఇప్పుడు ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తి చేస్తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. నగదు లావాదేవీలపై ఆధారపడడం కంటే ఈ విధానంలోనే చెల్లింపులు చేయడం మంచిదని భావిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. లావాదేవీలను చక్కబెట్టే సమయంలో తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను కూడా అత్యధిక శాతం మంది వినియోగదారులు పట్టించుకోవడం లేదు. నెటిజన్లలో ఏకంగా 52% మంది సైబర్‌ భద్రతను పట్టించుకోవడం లేదని ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌ సంస్థ ఓఎల్‌ఎక్స్‌ వెల్లడించింది. ఈ సంస్థ తాజాగా నిర్వహించిన ‘ఇంటర్నెట్‌ బిహేవియర్‌’ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే..

– ఆన్‌లైన్‌ కార్యకలాపాల సమయంలో నెటిజన్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని, బయటకు చెప్పకూడని విషయాలను వెల్లడిస్తున్నారు.
– సోషల్‌ మీడియా సాధనాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి వాటిలో తమ పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని తేలింది. 
– ఏకంగా 52 శాతం మంది తమ ఫోన్‌ నెంబర్లు, వ్యక్తిగత చిరునామా, ఇతర సమాచారాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడుతున్నారు.
– 26 శాతం మంది బ్యాంక్‌ లావాదేవీల సమయంలో తమకు వచ్చే ఓటీపీ (వన్‌ టైమ్‌ పాస్ట్‌వర్డ్‌)లను కూడా నిర్లక్ష్యంగా షేర్‌ చేస్తున్నారు.
– బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లు, వాటి పాస్‌వర్డ్‌లు, యూపీఐ పిన్, క్రెడిట్, డెబిట్‌ కార్డు వివరాలను 22% మంది ఇతరులతో పంచుకుంటున్నారు.
– 73 శాతం మంది టరŠమ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను (నిబంధనలు–షరతులు), లీగల్‌ గైడ్‌లైన్స్‌ను చదవడంలేదు. వీటిని పరిశీలించకుండానే ఆమోదించడం, స్కిప్‌ చేయడం వంటివి చేస్తున్నారు. కేవలం 27% మంది మాత్రమే ఆయా ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ను సైన్‌ చేసే సమయంలో పూర్తిగా చదువుతున్నారు. 
– 61 శాతం మంది నెలలో ఐదు కంటె ఎక్కువసార్లు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు బదిలీ చేయడం, ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడం చేస్తున్నారు. ఇక 37 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకుంటున్నారు. 
– 60 శాతం మంది తల్లితండ్రులు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారో పట్టించుకోవడంలేదు.
– సర్వే కోసం.. 15 నుంచి 55 సంవత్సరాల వయసున్న 7,500 మంది ఇంటర్నెట్‌ వినియోగదారులను విశ్లేషించినట్లు ఓఎల్‌ఎక్స్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు