ఆన్‌లైన్‌లో 56,295 ఆర్జిత సేవా టికెట్లు

8 Jul, 2017 01:35 IST|Sakshi
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల్లో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించి మొత్తం 56,295 టికెట్లను టీటీడీ శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో మొత్తం 12,495 టికెట్లు లక్కీడిప్‌ ద్వారా కేటాయించనున్నారు. ఇందులో సుప్రభాతం 7780, తోమాల 120, అర్చన120, అష్టదళ పాద పద్మారాధన 300, విశేష పూజ 1875, నిజపాద దర్శనం 2300 ఉన్నాయి. వీటిని పొందేందుకు  ధరఖాస్తులు ఆహ్వానించగా విశేష స్పందన లభించింది. ఈనెల 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న భక్తులకు అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు కంప్యూటర్‌ లక్కీడిప్‌ విధానంలో టికెట్లు కేటాయిస్తారు. దీనికి సంబంధించి మూడు రోజుల్లో నగదు చెల్లించాలి.

నగదు చెల్లించని టికెట్లను మరోసారి 17వ తేదీన లక్కీడిప్‌ ద్వారా ఇతర భక్తులకు కేటాయిస్తారు. మిగిలిన 43,800 సేవా టికెట్లలో కల్యాణోత్సవం 10,500, ఊంజల్‌సేవ 2800, ఆర్జితబ్రహ్మోత్సవం 6020, వసంతోత్సవం 11,180, సహస్ర దీపాలంకార సేవకు 13,300 టికెట్లను పాత పద్ధతిలోనే భక్తులు పొందారు. కాగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను లక్కీడిప్‌ విధానంలో కేటాయించటం జూన్‌ 16వ తేదిన టీటీడీ ప్రారంభించింది. ఆరోజున సెప్టెం బరులో తిరుమల ఆలయంలో జరిగే ఆర్జిత సేవలకు సంబంధించి మొత్తం 10,710 టికెట్లను ఈ లక్కీడిప్‌ విధానం భక్తులకు కేటాయించారు. వాటిని అదే నెలలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భక్తులకు మాత్రమే ఈనెల 17న కేటాయిస్తారు.
మరిన్ని వార్తలు