వేగంగా కోలుకుంటున్నారు..

9 May, 2020 04:28 IST|Sakshi

కరోనాను జయించి శుక్రవారం 62 మంది డిశ్చార్జ్‌

ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి 

ప్రకాశం జిల్లాలో మొత్తం 61 మందికి గాను 60 మంది డిశ్చార్జ్‌

చిత్తూరు జిల్లాలో 85 మందికి గాను 74 మంది కోలుకున్నారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారు. శుక్రవారం 62 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు వైద్యారోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 842కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారి సగటు 29.35 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో 44.62 శాతానికి చేరింది. ప్రారంభంలో వేగంగా విస్తరించిన ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చింది. 

► ప్రకాశం జిల్లాలో మొత్తం 61 మందికి వైరస్‌ సోకగా వారిలో 60 మంది కోలుకున్నారు. ఒకరు మాత్రమే చికిత్స తీసుకుంటున్నారు. 
► చిత్తూరు జిల్లాలో మొత్తం 85 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, వారిలో 74 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన 11 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు.  కరోనా వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయి. 
► శుక్రవారం డిశ్చార్జ్‌ అయిన 62 మందిలో 23 మంది కర్నూలు జిల్లావారు కాగా, గుంటూరు జిల్లా నుంచి 14, ప్రకాశం 8, చిత్తూరు 6, అనంతపురం 3, వైఎస్సార్‌ 3, కృష్ణా 3, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖ జిల్లాల నుంచి ఒక్కొక్కరున్నారు. 
► గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 వరకు 7,320 మందికి పరీక్షలు నిర్వహించగా, 54 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,887కు చేరింది.
► గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఇద్దరు, విశాఖలో ఒక్కరు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల సంఖ్య 41కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,004 మంది చికిత్స పొందుతున్నారు.  

మరిన్ని వార్తలు