బోగస్ కనెక్షన్లు 68 వేలు

30 Jul, 2014 02:10 IST|Sakshi
బోగస్ కనెక్షన్లు 68 వేలు
  • చమురు కంపెనీల సర్వేలో బయటపడిన నిజాలు
  •   ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఎన్నో కనెక్షన్లు
  •   ఆధార్ సాయంతో గుర్తిస్తున్న అధికారులు
  •   వేర్వేరు కంపెనీల్లో అకౌంట్ ఉన్న వారికి సరఫరా నిలిపివేత
  •   ‘దీపం’ కనెక్షన్లరునా రద్దే..
  • విజయవాడ :  బోగస్ గ్యాస్ కనెక్షన్ల ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. ఒకే పేరు, ఒకే అడ్రస్‌తో ఉన్న రెండు, మూడు గ్యాస్ కనెక్షన్లను ఏజెన్సీల నిర్వాహకులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేస్తున్నారు. ఇలాంటి కనెక్షన్లను రద్దుచేసేందుకు ప్రతిపాదనలు తయూరుచేస్తున్నారు. ఆధార్ నంబర్ల సహాయంతో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జిల్లాలో బినామీ పేర్లతో, రకరకాల అడ్రస్‌లు సృష్టించి వివిధ కంపెనీల గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న వినియోగదారుల వివరాలు తెలుసుకునేందుకు చమురు కంపెనీలు ఓ సర్వే నిర్వహించాయి. నెలరోజుల పాటు జరిగిన ఈ సర్వేలో హైదరాబాద్ తరువాత జిల్లావ్యాప్తంగా విజయవాడలో 68వేల దొంగ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన బోగస్ గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయటానికి నిర్ణయించారు.
     
    సర్వే ప్రక్రియ ఇదీ..
     
    జిల్లాలో 77 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. బీపీసీ, హెచ్‌పీసీ, ఇండేన్ గ్యాస్ కంపెనీలకు సంబంధించి జిల్లాలో 10,94,104 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో 8,59,071 మంది తమ ఆధార్ నంబర్లు గ్యాస్ కనెక్షన్‌కు అనుసంధానం చేసుకున్నారు. ఇంకా 2,35,033 మంది ఈ ప్రక్రియ పూర్తిచేయలేదు. వీరిలో దాదాపు 1,67,033 మందికి ఇంకా ఆధార్‌కార్డు రాలేదు. మిగిలిన 68 వేలమంది వినియోగదారులకు దొంగ కనెక్షన్లు ఉన్నట్లు చమురు కంపెనీలు గుర్తించాయి.
     
    మూడు రకాలుగా దొంగ కనెక్షన్లు
     గ్యాస్ ఏజెన్సీలు జరిపిన సర్వేలో మూడు రకాలైన దొంగ కనెక్షన్లు గుర్తించారు.
      ఒకే అడ్రస్, ఒకే పేరుతో వేల సంఖ్యలో కనెక్షన్లు ఉన్నాయి.
      వేరే పేరు, వేరే అడ్రస్‌తో కూడా చాలామంది కనెక్షన్లు తీసుకున్నారు.
      దీపం గ్యాస్ కనెక్షన్లు పొందిన వేలాది మంది వాటిని అన్యాక్రాంతం చేసి ఇతరులకు విక్రయించారు. దీపం పథకం ద్వారా పొందిన కనెక్షన్‌ను కొందరు ఇతరులకు అమ్ముకుని, తిరిగి వేరొక కంపెనీలో తమ సొంత పేర్లతో కొత్త కనెక్షన్ తీసుకున్నారు.
     
    ఇలా.. గ్యాస్ కనెక్షన్ పొందిన వారిని సర్వేలో గుర్తించారు. చమురు కంపెనీలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసుకుని ఒకే పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లను పట్టుకున్నారు. మూడు కంపెనీలలో ఒకే పేరు ఉన్న వారికి గ్యాస్ సరఫరా నిలిపివేశారు. మిగిలిన రెండు కంపెనీల్లో కనెక్షన్లు రద్దుచేసుకుని అక్కడి డిపాజిట్లను వెనక్కి తీసుకెళ్లిన వారికి మూడో కంపెనీకి చెందిన గ్యాస్‌ను రెగ్యులర్ చేస్తామని చమురు కంపెనీల అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.   
     

మరిన్ని వార్తలు