కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి ఓ ఇంటిలో 70 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయి. బాధితుల కథనం మేరకు.. పట్టణంలోని జయనగర్ కాలనీకి చెందిన శివశంకర్ మునిసిపల్ కార్యాలయ సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అనారోగ్యానికి గురైన కూమార్తెను తీసుకొని గురువారం భార్యతో కలిసి విజయవాడ వెళ్లాడు. పసిగట్టిన దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువా ధ్వంసం చేసి చోరీ చేశారు.
ఇంటి తలుపులు తెరచి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు శివశంకర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న దంపతులు లోపలకు వెళ్లి పరిశీలించగా రూ.20 లక్షల విలువైన 70 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ ఎస్ఐ వలిబాషా, ఏఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రం డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వంశీధర్గౌడ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆదివారం డాగ్స్క్వాడ్తో తనిఖీ చేయిస్తామని చెప్పారు. అంతవరకు ఇంటిలోపలకు ఎవరూ వెళ్లరాదని సూచించారు.