‘ఇంకా 85 మంది ఆచూకీ తెలియాలి’

31 Mar, 2020 19:09 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా:  ఢిల్లీలోని నిజాముద్దీన్ మార్కజ్ జమాత్ లో ఇస్తమా జరగ్గా, ఏపీ నుంచి 711 మంది ఆ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా రెండు వేల మంది ప్రార్థనల్లో పాల్గొనగా, ఏపీ నుంచి ఏడు వందలకు పైగా అక్కడకు వెళ్లారన్నారు. ఆ ప్రార్థనల్లో సామాజిక దూరాన్ని పాటించకపోవడం వల్లే అక్కడికి వెళ్లిన వారికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అనేక మంది ప్రార్థనల్లో పాల్గొన్నారన్నారు. దాదాపు అందరికీ రక్త పరీక్షలు జరిపి వారిని స్వీయ నిర్బంధంలో ఉంచామన్నారు. కాగా, వీరిలో ఇంకా 85 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’)

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రార్థనకు వెళ్లిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వారు దయచేసి ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేస్తే అధికారులు నేరుగా వచ్చి పరీక్షలు చేస్తారన్నారు. ఈ విషయంలో ఎవరూ భయపడవద్దని, ప్రజలందరి ఆరోగ్యం కోసం మీరంతా బయటకు రావాలన్నారు. దేవుడి దయవల్ల కరోనా వైరస్‌ వల్ల మన రాష్ట్రంలో ఎవరూ మరణించలేదని,  జిల్లా వ్యాప్తంగా 138 మంది శ్యాంపిల్స్‌ ల్యాబ్‌కు పంపగా, 65 మందికి నెగిటివ్‌ రావడం జరిగిందన్నారు. ప్రొద్దుటూరులో ఏడుగురు స్వచ్ఛందంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారన్నారు. తెలంగాణా లో 77 మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా 6 మంది మరణించిన విషయాన్ని అంజాద్‌ బాషా గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియా ద్వారా సమాచారం ఢిల్లీ వెళ్లిన వారికి అందేలా చూడాలన్నారు. (సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు