బామ్మ వయసులో గర్భం

5 Sep, 2019 03:25 IST|Sakshi
మంగాయమ్మను పరీక్షిస్తున్న డాక్టర్‌ ఉమాశంకర్‌

దేశంలోనే మొదటిసారి అంటున్న వైద్యులు

నేడు గుంటూరులో సిజేరియన్‌

గుంటూరు: తల్లి కావాలన్న ఆమె కల ఎట్టకేలకు నెరవేరే రోజొచ్చింది. 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన ఆమెకు గురువారం వైద్యులు సిజేరియన్‌ చేసి పురుడుపోయనున్నారు. ఐవీఎఫ్‌ స్పెషాలిటీ వైద్య నిపుణుడు, గుంటూరు అహల్యా హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో  మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. మంగాయమ్మకు 73 ఏళ్లు రావడంతో పిల్లలు పుట్టడం లేదన్న బాధతో వారు గతేడాది చెన్నై వెళ్లి ఐవీఎఫ్‌ (ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌) ద్వారా సంతానం పొందాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.

2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్‌ పద్ధతిలో భార్య గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్‌ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్‌ మెడిసిన్‌ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్‌ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు మంగాయమ్మకు ఆపరేషన్‌చేసి పురుడుపోయనున్నట్లు డాక్టర్‌ ఉమాశంకర్‌ చెప్పారు. 73 ఏళ్ల వృద్ధురాలు గర్భం దాల్చడం దేశంలో ఇదే మొదటిసారని వివరించారు.

మరిన్ని వార్తలు