96.17% ఇంగ్లిష్‌కే ఆమోదం!

1 May, 2020 04:58 IST|Sakshi

తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం కోరుకున్న తల్లిదండ్రులు

ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా అంగీకార పత్రాలు

తెలుగు మాధ్యమానికి 3.05 శాతం మంది ఓటు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఆమోదం తెలిపారు. ఈమేరకు తమ ఐఛ్చికాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారానే తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లలు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలనే ఆకాంక్ష వ్యక్తమైంది.

ఎంచుకునేందుకు మూడు ఆప్షన్లు..
న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో 1 –5 తరగతి చదివే విద్యార్థులు 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారో తెలుసుకొనేందుకు తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం ఆప్షన్లను కోరిన సంగతి తెలిసిందే. వీరంతా రెండు నుంచి ఆరో తరగతి వరకు చదువులు కొనసాగించనున్నారు. 
► ఏ మాధ్యమంలో బోధన కొనసాగించాలో సూచించేందుకు ప్రభుత్వం మూడు ఆప్షన్లను కల్పించింది. తెలుగు తప్పనిసరిగా ఉంటూ ఆంగ్ల మాధ్యమంలో బోధన ఒకటి కాగా, తెలుగు మాధ్యమంలో బోధన రెండోది. ఇతర భాషల్లో బోధన మూడో ఆప్షన్‌గా ఇచ్చారు.  
►1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు  17,87,035 మంది ఉండగా 17,85,669 మంది తల్లిదండ్రులు తమ ఐచ్ఛికాన్ని తెలియజేస్తూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు. 
► మొదటి ఐచ్ఛికాన్ని టిక్‌ చేస్తూ 96.17 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియంలో బోధనకే ఓటు వేశారు. తెలుగు మీడియం కోరుకున్నవారు 3.05 శాతం మంది కాగా ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతం ఉన్నారు. ఏప్రిల్‌ 29 వరకు అందిన  వివరాల ప్రకారం ఈ గణాంకాలు నమోదయ్యాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మాధ్యమంలో బోధన సాగాలో మాధ్యమాల వారీగా పేరెంట్సు అందించిన ఆప్షన్లు ఇలా..

మరిన్ని వార్తలు