పారదర్శక ఆలయాలు!

27 Aug, 2019 04:22 IST|Sakshi

ప్రజాసేవకు సిద్ధమవుతున్న గ్రామ, వార్డు సచివాలయాలు

గత సర్కారు మాదిరిగా కొటేషన్లు లేవు.. నామినేషన్‌ లేదు

రివర్స్‌ టెండర్ల ద్వారా అన్నీ తెలిసేలా

కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు,ఫర్నిచర్‌కు రివర్స్‌ టెండర్లు

వలంటీర్ల ఫోన్లకూ ‘రివర్స్‌’ విధానమే

సచివాలయాల్లో ప్రతి రోజూ స్పందన 

సాక్షి, అమరావతి: అన్నం ఉడికిందో లేదో తెలుసుకునేందుకు ఒక్క మెతుకు చూస్తే చాలు! గత సర్కారు ఐదేళ్ల పాలనకు, ప్రస్తుత ప్రభుత్వం పరిపాలనకు ఎంత వ్యత్యాసం ఉందో మూడు నెలల వ్యవధిలోనే కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ అధికారంలో ఉండగా పని చిన్నదైనా పెద్దదైనా సరే కొటేషన్లు, నామినేషన్లపైనే అస్మదీయులకు అప్పగించేశారు. అయితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి పునాదులుగా నిలువనున్న  గ్రామ, వార్డు సచివాల యాలన్నీ పూర్తి పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించేలా చూడాలన్న ధృఢ సంకల్పంతో వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వీటిల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక వసతులను కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

అంతా రివర్స్‌ టెండరింగ్‌లోనే... 
గత సర్కారు సమయం సరిపోదనే సాకుతో రూ.వేల కోట్ల విలువైన పనులను అస్మదీయులైన కాంట్రాక్టర్లకు నామినేషన్లపైన,  కొటేషన్లు తీసుకుని అప్పగించేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నా అంతా పూర్తి పారదర్శకంగా, రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో చేపడుతున్నారు. 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల్లో మౌలిక వసతులన్నీ రివర్స్‌ టెండరింగ్‌లోనే చేపడుతున్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, జిరాక్స్‌ మిషన్లు, ఫర్నీచర్‌ అంతా రివర్స్‌ టెండరింగ్‌ విధానంలోనే సమకూరుస్తున్నారు. ఇందుకు సంబంధించి టెండరింగ్, రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 

నాడు అలా.. నేడు ఇలా
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ సొమ్ముతో సాధికార మిత్రలకు సెల్‌ఫోన్ల కొనుగోలుకు చర్యలు చేపట్టారు. చంద్రబాబు సర్కారు కొటేషన్లు తీసుకుని తనకు కావాల్సిన కంపెనీల నుంచి సెల్‌ఫోన్లు తీసుకుంది. అయితే ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు వలంటీర్లకు సెల్‌ఫోన్లను కూడా రివర్స్‌ టెండరింగ్‌ ద్వారానే కొనుగోలు చేసి ఇవ్వాలని నిర్ణయించింది. వాటిని ఉచితంగా ఇవ్వడం లేదని, ఖరీదు ఆధారంగా వలంటీర్ల నుంచి నెలకు రూ.500 చొప్పున వాయిదాల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుందని ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి. సెల్‌ఫోన్ల  కొనుగోళ్లకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించాయి.

చూడగానే గుర్తించేలా ఒకే రంగులో..
రాష్ట్ర ప్రభుత్వం 1,93,421 గ్రామ వలంటీర్లు, 73,375 మంది వార్డు వలంటీర్ల నియామకాలను చేపట్టిన విషయం తెలిసిందే. అదేవిధంగా 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియనూ చేపట్టడం విదితమే. ముఖ్యమంత్రి జగన్‌ సూచనల మేరకు ఒక పక్క గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా చర్యలను చేపడుతూనే మరోపక్క వీటి రంగులు కూడా రాష్ట్రం మొత్తం ఒకే మాదిరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చూడగానే వీటిని గుర్తించేలా ఒకే తరహాలో ఉండనున్నాయి. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల పేర్లను గ్రామ సచివాలయం దగ్గర  ఏర్పాటు చేసే శాశ్వత డిస్‌ప్లే బోర్డులో ఉంచనున్నారు. గాంధీజీ జయంతి రోజైన అక్టోబర్‌ 2వతేదీ నుంచి పని ప్రారంభించనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ ‘స్పందన’ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందన కార్యక్రమంలో తెలియజేసే అవకాశం కల్పించారు. 

పడిగాపులు కాయాల్సిన పనిలేదు...
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కోసం లబ్ధిదారులు ఇక పడిగాపులు కాయాల్సిన పనిలేదు. గ్రామ, వార్డు సచివాలయాల పని వేళ్లల్లో నిరంతరం ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. రేషన్‌ కార్డులు, పింఛన్ల మంజూరుకు అర్హత ఉందా లేదా? అనేది తొలి దశలో అక్కడికక్కడే తేల్చేయనున్నారు. అర్హత ఉంటే 72 గంటల్లో మంజూరు చేస్తామంటూ అక్కడిక్కడే రశీదును లబ్ధిదారులకు అందజేస్తారు. అర్హత లేకపోతే ఎందుకు అర్హత లేదో కారణాలను వివరిస్తూ కూడా వారికి పత్రం అందిస్తారు. తొలిదశలో అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, పింఛన్లు మంజూరు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పందన కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలు పరిశీలించి రేషన్‌ కార్డులకు, పింఛన్లకు ఎంత మంది అర్హులో నిర్ధారించనున్నారు. వారందరికీ అక్టోబర్‌ 2వ తేదీన రేషన్‌ కార్డులను, పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే మంజూరు చేసేందుకు అధికారులు చర్యలను చేపడుతున్నారు. రేషన్‌ కార్డుల మంజూరు బాధ్యతలను తహసీల్దార్లకు, పింఛన్ల మంజూరు బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయించారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంజూరు చేసిన లబ్ధిదారుల జాబితాలను జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. ఈ జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల బోర్డుల్లో కూడా ప్రకటించనున్నారు. 

మరిన్ని వార్తలు