కన్నతండ్రి కర్కశత్వం

2 Sep, 2017 02:15 IST|Sakshi
కన్నతండ్రి కర్కశత్వం
ముగ్గురు బిడ్డలకు విషమిచ్చి, బావిలోకి తోసేసిన తండ్రి 
 
సోమశిల: భార్య వేరొకరితో వెళ్లిపోయిందనే అక్కసుతో ముగ్గురు ఆడ పిల్లలకు కన్నతండ్రే పురుగుల మందు తాగించి బావిలోకి తోసేశాడు.  నెల్లూరు జిల్లా కామిరెడ్డిపాడులో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతిచెందగా, మరో బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కామిరెడ్డిపాడులోని గిరిజన కాలనీకి చెందిన నల్లు పెంచలరత్నం పదేళ్ల క్రితం వైఎస్సార్‌ జిల్లా చెన్నంపల్లి ఎగువమిట్టకు చెందిన భానును వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. ఏడాది క్రితం జీవనోపాధి నిమిత్తం పెంచలరత్నం అప్పు చేసి కువైట్‌ వెళ్లాడు.

అతడి భార్య భాను సమీప బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుని 20 రోజుల క్రితం పిల్లలను ఇంట్లో వదిలేసి పరారైంది. ఇది తెలుసుకున్న పెంచలరత్నం రెండ్రోజుల క్రితం కువైట్‌ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. భార్య వెళ్లిపోయిందన్న అక్కసుతో తన ముగ్గురు కుమార్తెలు హరిత(8), కీర్తి(6), ప్రేమ (4)లను గ్రామ సమీపంలోని దిగుడు బావి వద్దకు తీసుకెళ్లి, పురుగు మందు తాగించి.. హరిత, కీర్తిలను బావిలోకి తోసేశాడు. కాలనీవాసులు గమనించి ప్రేమను బావిలో పడవేయనివ్వకుండా అడ్డుకున్నారు. బాలికను వెంటనే ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. 
మరిన్ని వార్తలు