భార్యా పిల్లల్ని హతమార్చాడు

15 Jun, 2015 08:08 IST|Sakshi

బొబ్బిలి (విజయనగరం): కన్నతండ్రే తన భార్య, పిల్లలను కత్తితో పీక కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతనూ చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. ఈ విషాద సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లిసీతారామపురం గ్రామంలో సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గండి వెంకటరమణ (40) కు భార్య గంగ(36), కుమారులు నాగప్రవీణ్ (14), నవీన్ (12) లు ఉన్నారు. గత కొంత కాలంగా కుటుంబ కలహాలు జరుగుతుండటంతో వెంకటరమణ ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో భార్య, పిల్లలకు తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చాడు. వారు మత్తులోకి వెళ్లగానే కత్తితో ముగ్గురు పీకలు కోసి అనంతరం ఇంటి వద్ద ఉన్న చెట్టుకు అతడూ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే, పెద్ద కొడుకు నాగ ప్రవీణ్‌కు సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మత్తు వదిలి మెలుకువ రావడంతో మాట్లాడలేని స్థితిలో వెళ్లి పక్కింటి వారిని నిద్రలేపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను గ్రామస్తులు వైజాగ్‌కు తరలించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామస్తులు సమీపంలోని పోలీసుకుల సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు