ఓటుకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి

26 Mar, 2015 02:19 IST|Sakshi

నెల్లూరు(రెవెన్యూ): ఓటర్ ఐడీకార్డులను ఆధార్‌కు అనుసంధానం చేసేందుకు వివిధ రాజకీయపార్టీల నాయకులు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఎం. జానకి తెలిపారు. గోల్డెన్ జూబ్లీహాలులో ఓటర్ ఐడీకార్డు ఆధార్ సీడింగ్‌పై వివిధ శాఖల అధికారులు, రాజకీయపార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్లందరూ తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయించుకోవాలని సూచించారు.

ఓటర్ల జాబితాలో డబల్ ఎంట్రీలు, మరణించిన వారి ఓట్లు ఉన్నాయన్నారు. ఓటర్ ఐడీ ఆధార్ సీడింగ్ ప్రక్రియ పూర్తి అయితే బోగస్ ఓట్లు తొలగిస్తామని వెల్లడించారు. డీఆర్‌ఓ సుదర్శన్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు పి. రూప్‌కుమార్, టీడీపీ ప్రతినిధి భూవనేశ్వరీప్రసాద్, బీజేపీ ప్రతినిధి కాళేశ్వరరావు, సీపీఎం ప్రతినిధి పి. శ్రీరాములు, బీఎస్‌పీ సుధాకర్ పాల్గొన్నారు.
 
కోర్టు కేసులపై సకాలంలో స్పందించండి..
భూములు తదితర వాటికి సంబంధించిన కోర్టు కేసులపై సకాలంలో స్పందించి వివరాలు అందజేయాలని డీఆర్వో సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గోల్డెన్‌జూబ్లీహాలులో డీటీలు, డీఏవోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్ ఏవో రామకృష్ట తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు