దేశంలో గందరగోళం!

16 Feb, 2018 02:53 IST|Sakshi

ఆత్మరక్షణలో పడిపోయి.. తత్తరపాటుతో లీకులు...

మార్చి 5న టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారన్న మంత్రి ఆది

గంట తిరగకుండానే మంత్రి యూటర్న్‌

అది తన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ

సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా సాధించడానికి తమ పార్టీ ఎంపీలతో  పాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేయడానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌ అధికార తెలుగుదేశం పార్టీని మరింత ఆత్మరక్షణలో పడేసింది. పార్టీలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని, ఇందుకు చంద్రబాబు ముందుకు రావాలని  జగన్‌ సవాల్‌ విసిరారు. దీంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తత్తరపాటుకు గురైంది.

ఈ సవాల్‌పై ఎలా స్పందించాలో అర్థం కాక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించింది. పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిపిన చంద్రబాబు ఆ సమావేశం పూర్తయ్యాక విలేకరులతో మాట్లాడలేదు. పైగా పార్టీ సమన్వయ సమావేశంలో చర్చించిన విషయాలను పార్టీ నేతల ద్వారా కూడా విలేకరులకు చెప్పించలేదు. కేవలం లీకులను ఇప్పించారు. వాటిలో కూడా పవన్‌ కల్యాణ్‌ను పార్టీ నేతలు విమర్శించవద్దని, పవన్‌ మనోడేనని అన్నట్లుగా చెప్పించారు.

జగన్‌ను తిట్టించబోయి ..
జగన్‌ సవాల్‌ విసిరిన నేపథ్యంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి చేత విలేకరుల సమావేశం పెట్టించి వ్యక్తిగత దుర్భాషలతో సమస్యను పక్కదోవ పట్టించడానికి తెలుగుదేశం వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. జగన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఆదినారాయణరెడ్డిపై విలేకరులు ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్రానికి ఇంకా ఎన్ని రోజులు గడువు ఇస్తారని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఏప్రిల్‌ 6న రాజీనామాలు చేయబోతున్న విషయాన్ని విలేకరులు మంత్రి దృష్టికి తీసుకురాగా కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే మార్చి5నే టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని ఆది ప్రకటించారు. అంతేకాదు పొత్తుకు అదే ఆఖరు రోజు అవుతుందని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే 19 అంశాలు కేంద్రం ముందుంచామని, వాటిలో ఒక్కటి చేయకపోయినా అదే పొత్తుకు చివరి రోజని మంత్రి వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌ తన ఎంపీల రాజీనామాలు చేయించడానికి ముందే తమ పార్టీ మంత్రులతో∙రాజీనామాలు చేయిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో జగన్‌ కంటే టీడీపీదే ముందస్తు నిర్ణయం అన్నారు. ఆయనది ఏప్రిల్‌ ఆరు డెడ్‌లైన్‌ అయితే మాది మార్చ్‌ ఐదు డెడ్‌లైన్‌ అని చెప్పారు. కేంద్రం చెప్పినదానికి, చేసిన దానికి పొంతనలేదని, కేంద్ర బడ్జెట్‌లో అనుకున్న మేరకు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయింపులు జరగలేదన్నా రు.

ఈ విషయాలను చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి. జగన్‌ను తిట్టాల్సింది పోయి రాజీనామాల గురించి మాట్లాడటం, అది మీడియాలో ప్రముఖంగా ప్రసారం కావడంతో అధినేత చంద్రబాబు కంగుతిన్నా రు. గంట తిరక్కుండానే మంత్రి ఆది చేత అదే చోట మళ్లీ విలేకరుల సమావేశం పెట్టించి వివరణ ఇప్పించారు. మంత్రుల రాజీనామా అనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పించారు. అలా జరుగుతుందని తాననుకుంటు న్నానని ఆది అన్నారు. అలాగే టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ చేత కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ఆది చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమ న్నారు.ఇలా టీడీపీలో ఎంత గందరగోళముం దో అర్ధమౌతోందని విశ్లేషకులంటున్నారు.

మరిన్ని వార్తలు