ఆరోగ్యశ్రీకి అర్హత లేదు

9 Jan, 2014 04:21 IST|Sakshi

 కరిచర్లగూడెం (గోపాలపురం), న్యూస్‌లైన్ : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమది. ఆ కుటుంబంలోని ఏడాది వయసున్న బాలుడికి పెద్దకష్టం వచ్చింది. తలలోని నరం పనిచేయకపోవడం వల్ల రోజురోజుకూ తల భాగం పెరుగుతోంది. దీంతో తల్లడిల్లిన తల్లిదండ్రులు ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు తీసుకుని హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్యశ్రీ కార్డులో పేరున్నా ఫొటో లేదని పొమ్మన్నారు. దీంతో వారు తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న వారు లేరు. కరిచర్లగూడెంకు చెందిన ఉపాధి కూలీ జమ్ము పైడిరాజు, సుభద్రలు తమ మూడో కుమారుడు బబ్లూకి ఏడు నెలల క్రితం గౌరీపట్నం మేరీమాత ఆలయంలో తలనీలాలు సమర్పించారు. అనంతరం బబ్లూ తల పెరుగుతుండటాన్ని వారు గమనించి రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించగా తలలో నరం పనిచేయడం లేదని, హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లగా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులో బబ్లూ ఫొటో లేదని పంపించేశారు. ప్రైవేట్‌గా చికిత్స చేయించుకోవాలంటే రూ. 1.20 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు స్వగ్రామం వచ్చి బబ్లూ ఫొటో, పేరు నమోదు చేయించేందుకు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో చేస్తాం.. ఇదిగో చేస్తాం. అంటున్నారేకానీపట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు