వజ్రోత్సవ ధగధగలు

9 Aug, 2014 01:13 IST|Sakshi
వజ్రోత్సవ ధగధగలు
  •      నేటి నుంచి ఏసీఏ డైమండ్ జూబ్లీ వేడుకలు
  •      రేపు విశాఖ రానున్న ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్
  • విశాఖపట్నం: ఆరు దశాబ్దాల క్రితం.. అప్పటి మద్రాసు నగరం నుంచి స్వయం ప్రతిపత్తి కోసం తరలివచ్చిన ఓ క్రీడా సంస్థ ఇప్పుడు ఇంతింతై ఎదిగి అవధుల్లేని ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రాంతంలో క్రికెట్ వటవృక్షంగా విస్తరించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వజ్రోత్సవాలకు ఉరకలేస్తోంది. ఏసీఏ కీర్తి కిరీటంలో వజ్రం వంటి విశాఖ ఈ ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. రెండు రోజుల వజ్రోత్సవ వేడుకలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది.

    క్రికెట్ ఘనాపాఠీలంతా పాల్గొనే ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ శ్రీనివాసన్ విశాఖ రానున్నారు. తొలిరోజైన శనివారం వేడుకల్లో నిన్నటి స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, గతతరం మేటి బౌలర్ జవగళ్ శ్రీనాథ్ హాజరు కానున్నారు. రెండో రోజు ఆదివారం వేడుకల్లో ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పాల్గొనబోతున్నారు. తొలిరోజు వేడుకలు వాల్తేర్ క్లబ్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి. మలిరోజు వేడుకలు నొవాటెల్‌లో ఐదుగంటలకు మొదలు కానున్నాయని  శుక్రవారం నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు.
     
    ఇదీ కార్యక్రమం : ఆంధ్ర మాజీ రంజీ ఆటగాళ్లకు సన్మానాలు, సాంస్కతిక కార్యక్రమాలతో వేడుకలు ఉల్లాసంగా సాగిపోనున్నాయి. ము గింపు వేడుకలకు బీసీసీఐ ప్రతినిధులు శివలాల్ యాద వ్, సంజయ్‌పటేల్, ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్, అనిల్‌కుంబ్లే, పాండవ్, మాథ్యూస్, వినోద్, చేతన్ భగత్ రానున్నారు.
     
    పూర్వ రంజీ ఆటగాళ్లకు ప్రోత్సాహం

    గడచిన అర్ధశతాబ్దిలో రంజీల్లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన 108 మంది క్రికెటర్లకు వజ్రోత్సవ వేడుకల్లో నగదు ప్రోత్సాహకం అందించనున్నారు.  ఆడిన మ్యాచ్‌ల ప్రకారం లక్ష నుంచి ఐదు లక్షల వరకు అందుకోనున్నారు. అటువంటి వారి ఆరోగ్య సమస్యలపై కూడా ఏసీఏ దృష్టి సారించనుందని గంగరాజు చెప్పారు.
     
    త్వరలోనే టెస్ట్ హోదా


    ఏసిఏ -వీడీసీఏ సంయుక్తంగా నిర్మించిన వైఎస్‌ఆర్ స్టేడియంకు త్వరలో టెస్ట్ హోదా లభించనుందని గంగరాజు తెలిపారు. ఇటీవలే ప్రతినిధుల బృందం స్టేడియాన్ని మ రోసారి పరిశీలించి పంపిన నివేదిక ప్రకారం కొన్ని మార్పులు చేస్తే త్వరలోనే విశాఖకు టెస్ట్ హోదా లభించనుందని చెప్పారు.
     
    అక్టోబర్‌లో మరో వన్డే

    ఏడాది వ్యవధిలో రెండు వన్డేలు నిర్వహించిన ఘనత విశాఖ స్టేడియం పరం కానుంది. గతేడాది చివర్లో వైఎస్సార్ స్టేడియంలో వెస్టిండీస్- భారత్ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వెస్టీండీస్ పర్యటనలో భాగంగా మరో మ్యాచ్ కు స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఏసీఏ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బీసీసీఐ కానుక అందించనుంది.
     
     ఏ క్రీడకైనా ప్రోత్సాహం
     ఏ క్రీడలో ప్రతిభ చూపుతున్న క్రీడాకారుడికైనా ఆర్థిక సాయం అందించేందుకు ఏసీఏ ముందుంటుంది. అందు కోసం రూ. 30 లక్షల నిధిని ఏర్పాటు చేశాం. వ్యక్తిగత క్రీడాంశాల్లోనే కాకుండా టీ మ్ ఈవెంట్లలోనూ ప్రతిభ చూపే ఆటగాళ్లకు సా యం అందిస్తాం.  చెస్, ఆర్చరీ, స్విమింగ్‌లో ప్ర తిభావంతులకు ఈ సాయం అందించాం.       
     - గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి
     

మరిన్ని వార్తలు