ఓఎస్డీగా అనిల్‌కుమార్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

28 Jul, 2019 11:38 IST|Sakshi
అనిల్‌కుమార్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి, తదితరులు  

సాక్షి, పులివెందుల : పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ(పాడా) ప్రత్యేక అధికారిగా అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ సంయుక్త సంచాలకుడుగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డిని ప్రభుత్వం ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డూటీ(ఓఎస్డీ)గా ..పులివెందుల ప్రాంత అభివృద్ధి అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. భాకరాపురంలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలోని పైఅంతస్తులో పాడా ఆఫీస్‌ను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం అనిల్‌కుమార్‌రెడ్డి పాడా ఆఫీస్‌కు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. అక్కడి సిబ్బందికి ఆఫీస్‌కు సంబంధించిన పలు విషయాలపై సూచనలు చేశారు. అనిల్‌కుమార్‌రెడ్డిని పులివెందుల వైఎస్సార్‌సీపీ నేత వైఎస్‌ మనోహర్‌రెడ్డి, కమిషనర్‌ నరసింహారెడ్డి, తహసీల్దార్‌ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు తనపై నమ్మకంతో ఓఎస్డీగా నియమించడం జరిగిందన్నారు. పులివెందుల ప్రాంత అభివృద్ధికి, నియోజకవర్గంలోని గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానన్నారు.  అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పాడా నిధులతో వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతానన్నారు. పట్టణ కన్వీనర్‌ వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు