కొత్తచట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలి

8 Jan, 2014 02:06 IST|Sakshi

సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: నూతన భూ సేకరణ చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి భూ నిర్వాసితులు మంగళవారం సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీని ముట్టడించారు. కలెక్టర్ వైఖరి నశించాలని, సింగరేణి యాజమాన్య మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. వందలాది మంది నిర్వాసితులు తరలివచ్చి జేవీఆర్ ఓసీ గేట్లను మూసివేశారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు, ఉద్యోగులను విధులకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. యాజమాన్యం భారీగా పోలీసులను మోహరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు సింగు నర్సింహారావు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు పరిశ్రమల ఏర్పాటు పేరుతో వేలకోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్న ప్రభుత్వా లు నిర్వాసితుల పట్ల మాత్రం వివక్ష ధోరణి అవలంబిస్తున్నాయని విమర్శించారు. ఏ పరిశ్రమ ఏర్పాటు చేసి నా నిర్వాసితులకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 సత్తుపల్లిలో సింగరేణి ఓసీ-2 నిర్వాసితుల పట్ల జిల్లా కలెక్టర్ నిరంకుశంగా వ్యవహరించి కొత్త చట్టం అమలు కావటానికి రెండురోజుల ముందే హడావుడిగా ఆదివారం రోజు జనరల్ అవార్డు ను ప్రకటించడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ఆ అవార్డును రద్దు చేయాలని, లేకుంటే ఆందోళన లు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం సత్తుపల్లి సీఐ యు.వెంకన్నబాబు భూ నిర్వాసితులు, సింగరేణి అధికారులతో చర్చించి ఆందోళనను విరమింప చేశారు. జేవీఆర్ ఓసీ మేనేజర్ వెంకటాచారికి నిర్వాసితులు వినతిపత్రం అందించగా.. నిర్వాసితుల సమస్యల ను పీఓ, జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో భూ నిర్వాసితులు ఉడతనేని అప్పారావు, జ్యేష్ట లక్ష్మణ్‌రావు, మామిళ్లపల్లి కృష్ణయ్య, వెల్ది ప్రసాద్, ములకలపా టి రవి, రావి నాగేశ్వరరావు, బొంతు రామారావు, మా రోతు నాగేశ్వరరావు, సీపీఐ డివిజన్ కార్యదర్శి దండు ఆదినారాయణ, యోబు, రామకృష్ణ, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాలడుగు శ్రీనివాస్, సీపీఎం నాయకులు రావుల రాజబాబు, మౌలాలి, కిష్టారం సర్పంచ్ కడారి మదీన, ములకలపాటి విష్ణు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు