సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీరాజ్ను కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. పార్టీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని సంఘీభావం తెలుపుతున్నారు.
వైఎస్ జగన్ ఇటీవల నిర్వహించిన ప్రజాసంకల్పయాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. అంతేకాకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఫల్యాలను, ప్రజల సమస్యలను తరచూ ఎత్తిచూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యప్రజలకు తెలిసేలా త్వరలో వీధి నాటకాల ప్రదర్శనలు చేపడతామని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.