2018 డీఎస్సీ నియామకాలు తరువాతే.. 

5 May, 2020 04:10 IST|Sakshi

కొత్త టెట్, డీఎస్సీ నిర్వహణ

లాక్‌ డౌన్‌ ముగిసిన రెండు వారాల తరువాత అధికారికంగా టెన్త్‌ షెడ్యూల్‌ ప్రకటిస్తాం 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ల నియామకానికి సంబంధించి  2018 డీఎస్సీ నియామకాలు పూర్తి అయిన తరువాతే కొత్తగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)ల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... 

► 2018 డీఎస్సీ విషయంలో న్యాయ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త టెట్, డీఎస్సీ నిర్వహించే పరిస్థితి లేదు. కరోనా, లాక్‌డౌన్‌ వంటి ప్రస్తుత పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. 
► 2018 డీఎస్సీ వివాదాలు పూర్తిగా సమసిపోయి, నియామకాలు పూర్తయ్యాకే కొత్త టెట్, డీఎస్సీలపై నిర్ణయం. 
► న్యాయ వివాదాలపై ప్రభుత్వ వాదనలను సమర్థంగా వినిపించి, అర్హత సాధించిన అభ్యర్ధులకు న్యాయం చేస్తాం. ఎస్‌జీటీ, మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, పీఈటీల పోస్టులపై కోర్టులో వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. 
► హిందీ, తెలుగు పండిట్‌ పోస్టుల వ్యాజ్యాలు క్లియర్‌ అయ్యాయి. వీటికి ఈ నెలాఖరుకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నాం. 
► టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారం అవాస్తవం. వాటిని ఎవరూ నమ్మొద్దు.  
► లాక్‌డౌన్‌ పూర్తిగా ముగిసిన రెండు వారాల తర్వాత టెన్త్‌ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వమే అధికారిక ప్రకటన చేస్తుంది.  

మరిన్ని వార్తలు